AIADMK Manifesto: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే అధికార డీఎంకే (DMK), విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా.. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే (AIADMK) ఓటర్లను ఆకర్షించేలా వరాల జల్లు కురిపించింది. తాజాగా విడుదల చేసిన తమ ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యతరగతి, పేద వర్గాలను లక్ష్యంగా చేసుకుని సంచలన హామీలను ప్రకటించింది.
ప్రధాన హామీలు ఇవే:
ఉచిత ఫ్రిజ్లు: రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా ఒక రిఫ్రిజిరేటర్ (Fridge) అందజేస్తామని అన్నాడీఎంకే హామీ ఇచ్చింది.
పురుషులకూ ఉచిత ప్రయాణం: ప్రస్తుతం మహిళలకు అమలులో ఉన్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పురుషులకు కూడా వర్తింపజేస్తామని ప్రకటించడం విశేషం.
ఆర్థిక సాయం: ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 10,000 చొప్పున నేరుగా నగదు బదిలీ చేస్తామని పేర్కొంది.
మహిళా ఉద్యోగులకు ఊరట: 5 లక్షల మంది మహిళా ఉద్యోగులకు ద్విచక్ర వాహనాల కొనుగోలుపై రూ. 25,000 రాయితీ (Subsidy) కల్పిస్తామని తెలిపింది.
రుణ మాఫీ: విద్యార్థులు బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యా రుణాలను (Education Loans) పూర్తిగా మాఫీ చేస్తామని అన్నాడీఎంకే తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.
నిత్యావసరాలు & పెన్షన్:
పేద ప్రజల ఆహార భద్రత కోసం రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు నెలకు ఒక కిలో పప్పు, ఒక కిలో మంచినూనె ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపింది. అలాగే, ఏటా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. సామాజిక భద్రతా పెన్షన్ను రూ. 2,000కు పెంచుతామని హామీ ఇచ్చింది.
తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు గౌరవార్థం.. ఈ క్రీడలో పాల్గొనే జల్లికట్టు యోధుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని అన్నాడీఎంకే స్పష్టం చేసింది.

