ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రితో దాదాపు ముప్పాతిక గంట బేటి సాగించారు. ఈ బేటిపై భిన్న కథనాలు విన్పించు తున్నా అత్యంత వివిఐ ల మధ్య జరిగిన చర్చలపై ఊహాగానాలు చేయడం వృథా ప్రయాసే. వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నదీ ఇతరులకు తెలిసే అవకాశం లేదు. అయితే రాష్ట్రానికి చెంది కేంద్రం నుండి రావలసిన నిధులు రాయితీల గురించి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రికి లేఖ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇందులో షరా మామూలు గా పోలవరం ప్రాజెక్టుకు నిధులు ప్రత్యేక హోదా లోటు బడ్జెట్ పూడ్చేందుకు రావలసిన నిధులు తదితరాలు లేఖలో వుంటాయి.
అయితే ఇవేవీ ముఖ్యమైనవి కావు. వీటి కోసం ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణం పెట్టుకోలేదు. తను ప్రతిపాదించిన మూడు రాజధానులకు శాసన మండలి రద్దుకు కేంద్రం నుండి ఆమోదానికే ముఖ్యమంత్రి ఈ బేటీ ఏర్పాటు చేసుకున్నారు. ఇవి ఒక విధంగా వివాదాంశాలే. ఎందుకంటే రాష్ట్ర బిజెపి నాయకత్వం కూడా ఈ అంశాల్లో వ్యతిరేక వైఖరి తీసుకొని పోరాడుతోంది. ఈ అంశాల్లో కేంద్రం నుండి క్లారిటీ కోసం వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్ర తర్వాత రాష్ట్రంలో సంభవించే పరిణామాలను బట్టి వీరిరువురి మధ్య సాగిన చర్చల సారాంశం అంచనా వేయవలసి వుంటుంది. ఢిల్లీ నుండి వచ్చిన వెంటనే పరిపాలన సౌలభ్యం పేరుతో ప్రభుత్వ కార్యాలయాల తరలింపు వేగవంతం చేసిందంటే ప్రధాన మంత్రి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే లెక్క..ఎవరు ఎన్ని ఉద్యమాలు చేసినా ముఖ్యమంత్రి వెనకడుగు వేసే ప్రసక్తే వుండదు. ఒక వేళ ఈ చర్యలు మంద గించితే ప్రధాన మంత్రి నుండి సానుకూలత లభ్యం కాలేదని భావించాలి. అంతేకాదు శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభ తీర్మానం చేసి పంపిన ప్రతిపాదనల ఫైల్ కేంద్ర హోం శాఖ చురుకుగా కదలించిందంటే ముఖ్యమంత్రికి ప్రధాన మంత్రి హామీ ఇచ్చినట్లు భావించ వచ్చు. లేదా శాసన మండలిని ప్రొరోగ్ చేసి ఆర్దినెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినా ప్రధాన మంత్రి గో అహెడ్ అని చెప్పినట్లు భావించ వచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారం రోజుల్లో గైకొనే చర్యలను బట్టి ముఖ్యమంత్రి ప్రధాని మధ్య జరిగిన చర్చలు తీరు అంచనా వేయవచ్చు. ఈ లోపు ఎవరు ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా అవన్నీ ఉత్తుత్త ఊహాగానాలే
