శింబు సరసన నటించాలన్నదే కోరిక: దేవయాని

తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో నటించిన ఢల్లీి భామ దేవియాని శర్మ కోలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు తహతహలాడుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్‌ మోస్ట్‌ బ్యాచిలర్‌ శింబు సరసన నటించాలని తెగ ఆరాటపడుతున్నారు. తన జీవితాశయం కూడా శింబు సరసన నటించడమేనని అంటున్నారు.

2021లో ’రొమాంటిక్‌’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన దేవియాని శర్మ… పలు రకాల నృత్యాల్లో శిక్షణ పూర్తి చేశారు. తన తమిళ సినీ రంగ ఎంట్రీపై ఆమె స్పందిస్తూ.. ‘తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో నటించినప్పటికీ.. తమిళంలో నటించాలన్న కోరిక బలంగా ఉంది.

ముఖ్యంగా శింబు సరసన నటించాలన్నదే నా జీవితాశయం. కేవలం హీరోయిన్‌గానే కాకుండా, ప్రేక్షకులను మెప్పించే అన్ని రకాల పాత్రలు చేసే నటిగా గుర్తింపు పొందాలి. కీర్తి సురేష్‌, సాయిపల్లవి నాకు ఎంతో ఇష్టమైన హీరోయిన్లు. వీరే నాకు ఆదర్శం. శింబు సరసన నటించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. ఇందుకోసం ముమ్మరంగా నా వంతు కృషి చేస్తున్నా‘ అని దేవియాని శర్మ పేర్కొన్నారు.

దేవియాని శర్మ ఇటీవల నటించిన వెబ్‌ సిరీస్‌లన్నీ మంచి ఆదరణను పొందిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ’సేవ్‌ ద టైగర్స్‌’, ’సైతాన్‌’ వెబ్‌ సిరీస్‌లలో దేవియాని శర్మ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. బోల్డ్‌ సీన్స్‌ని కూడా ఆమె ధైర్యంగా చేయడంతో.. ప్రస్తుతం ఆమెకు ఆఫర్స్‌ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆమెకు కోలీవుడ్‌ నుండి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆమె కోలీవుడ్‌లోనూ బిజీ నటిగా మారతాననే ధీమాని వ్యక్తం చేస్తోంది.