ఆర్జీవికి మరోమారు చుక్కెదురు!

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ సినిమా సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ సస్పెన్షన్‌ను తెలంగాణ హైకోర్టు మరోసారి పొడిగించింది. మరో మూడు వారాల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

‘వ్యూహం’ సినిమాలో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్‌ బోర్డు నిపుణుల కమిటీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కొత్త సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీ విషయంలో మూడు వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.

వాస్తవానికి గత ఏడాది ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఈ సినిమాపై హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ సినిమా రాజకీయంగా తమను కించపరిచే విధంగా, తమ ప్రతిష్టతకు భంగం కలిగించే విధంగా ఉందంటూ నారా లోకేష్‌ పిటిషన్‌లో పేర్కొన్నాడు.

అయితే ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్‌ బెంచ్‌ ఈ నెల 11 వరకు విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ తీర్పును సవాల్‌ చేస్తూ నిర్మాత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

సినిమా సకాలంలో విడుదల కాకపోవడం వల్ల కోట్లల్లో నష్టం వచ్చిందని నిర్మాత తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. స్పందించిన హైకోర్టు సింగిల్‌ బెంచ్‌లోనే తేల్చుకోవాలని పిటిషనర్‌కు స్పష్టం చేయడంతో సినిమా విడుదలపై ప్రతిష్టంభన కొనసాగుతుంది.