ఆగ్రా సన్నివేశాలు వైరల్‌.. సోషల్‌ విూడియా కామెంట్స్‌పై నొచ్చుకున్న రుహానీ శర్మ

రుహానీ శర్మ నటించిన ‘ఆగ్రా’లోని కొన్ని సన్నివేశాలు నెట్టింట వైరల్‌ కావడంపె ఆమె అసహనం వ్యక్తంచేశారు. ఈ సినిమా కథ ఎన్నో అవార్డులను గెలుచుకుందని.. దాన్ని పట్టించుకోకుండా తన సన్నివేశాలను వైరల్‌ చేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రుహానీ నటించిన ‘ఆగ్రా’ గతేడాది విడుదలైంది.

తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. దీంతో కొందరు ఇందులోని బోల్డ్‌ సన్నివేశాలను సోషల్‌ విూడియాలో షేర్‌ చేస్తున్నారు. రుహానీ ప్రైవేట్‌ వీడియోస్‌ అంటూ వాటిని వైరల్‌ చేస్తున్నారు. దీనిపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. ‘ఆగ్రా’లోని సన్నివేశాలు లీక్‌ అయినప్పటినుంచి నేను ఎంతో నిరుత్సాహంగా ఉన్నాను. నా బాధను వివరించడానికి నిరుత్సాహం అనేది కూడా చిన్నమాటే. మా కష్టాన్ని, అంకితభావాన్ని విస్మరించి కేవలం కొన్ని సన్నివేశాలను మాత్రమే వైరల్‌ చేయడం హృదయవిదారకంగా ఉంది. కళాత్మక చిత్రాలను రూపొందించడం ఎంతో పెద్ద సవాలు. వాటి కోసం నిద్ర లేని రాత్రులు గడపాలి. అలాంటి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రక్తాన్ని చెమటగా మార్చాలి. కన్నీళ్లను అర్థం చేసుకోకుండా కొందరు దాని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు.

కొన్ని సన్నివేశాల ఆధారంగా సినిమాపై ఓ నిర్ణయానికి రాకూడదు. అది సరైన పద్థతి కాదు. ఈ చిత్రాన్ని కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2023లో ప్రదర్శించారు. చిత్ర బృందానికి దక్కిన గౌరవం అది. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో వర్క్‌ చేసినందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఈ సినిమా శైలిని అందరూ గుర్తించాలని కోరుతున్నాను. కళ ఎప్పుడూ సులభంగా, సౌకర్యవంతంగా ఉండదు. ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. కళాకారుల శ్రమను వృథా చేయకండి. సినిమా గొప్పతనాన్ని అర్థం చేసుకోండి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.