అమరావతిలో స్టూడియో కట్టకపోవడానికి కారణం ఇదే: సురేష్ బాబు

అప్పటికే తమకు అమరావతిలో స్టూడియో పెట్టాలని ఉందని, దాని కోసం ప్రత్యేకంగా చర్చలు కూడా కొనసాగాయని ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తెలిపారు. అప్పటి ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంపై కలిశామన్న ఆయన, మీరు పాలసీకి ఒక నిర్ణయం తీసుకోండి. అది అమరావతిలో కావాలా.. లేదంటే ఇంకెక్కడా అనేది ముందు ఆలోచించండి. ఒక సారి మీరు నిర్ణయించాక దానిపై ఓ పాలసీని ఏర్పాటు చేస్తామని అన్నట్టు ఆయన తెలిపారు. తమకు ఎక్కువేం అవసరం లేదు. 50 నుంచి 100 ఎకరాలు కలిగిన ఎవరైనా సమర్థులు, కేవలం ల్యాండ్ కోసం కాకుండా స్టూడియోస్‌లుగా కట్టి వాటిని ఆపరేట్ చేసే వాళ్లకు ఇస్తే ఇండస్ట్రీ ఆటోమేటిక్‌గా వస్తుందని తాము అన్నట్టు ఆయన చెప్పారు.

గవర్నమెంట్‌గా వారు స్కిల్స్‌ను డెవలప్ చేయాలని, ఒక సినిమా తీయాలంటే చాలా స్కిల్స్ కావాలని, వాటిని డెవలప్ చేయాలంటే కొన్ని కేటగిరీస్‌లలో ప్రత్యేక శిక్షణలు ఇప్పించాలని తాము కోరినట్టు ఆయన తెలిపారు. కావాలంటే ప్లాన్ చేయండి అని వారు అన్నారు. అంతే కాకుండా ల్యాండ్ కూడా అలాట్ చేశారని, కానీ దాన్ని తాను తీసుకోలేదని ఆయన అన్నారు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీని తీసుకురావాలనుకోవడం అనేది చిన్న విషయం కాదన్న ఆయన, మద్రాస్‌ నుంచి ఇక్కడి వరకు వచ్చామంటే చాలా మంది దానికి కృషి చేశామని, దాన్ని వాళ్లు కేవలం సెట్ చేశామని ఆయన చెప్పారు. ఇప్పటికీ కొన్ని సామాగ్రిని మద్రాస్‌నుంచి తెచ్చుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు ఇండస్ట్రీ రావడం చాలా అవసరం అని సురేశ్ బాబు చెప్పారు. ఎందుకంటే ఎన్ని చోట్ల ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటే అక్కడ లోకల్ టాలెంట్‌కి చాలా అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం డిజిటల్ మీడియా ఉంది కాబట్టి చాలా రకాలుగా సెలక్షన్ జరుగుతుందన్న ఆయన, ఒకవేళ మంచి మౌళిక వసతులు కూడా ఉన్నట్టయితే ఇంకా ఎంతో టాలెంట్‌ను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.