రాజ్‌తో రిలేషన్‌షిప్‌… త్వరలోనే పెళ్లి: దూత వెబ్‌సీరిస్‌ నటి ప్రియా భవానీ శంకర్‌ వెల్లడి

’ధూత’వెబ్‌ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి ప్రియా భవానీ శంకర్‌ తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్‌ అనే వ్యక్తితో తాను దాదాపు పదేళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్నానని తెలిపారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని ఎప్పటినుంచో అనుకుంటున్నామని.. వచ్చే ఏడాది తప్పకుండా పెళ్లి చేసుకుంటామన్నారు. సినీ పరిశ్రమలోకి రాక ముందునుంచే రాజ్‌తో నేను ప్రేమలో ఉన్నా. మేమిద్దరం విడిపోయామంటూ ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. వాటిని పెద్దగా పట్టించుకోలేదు.

ఇప్పటివరకూ నేను చాలామంది నటులతో కలిసి వర్క్‌ చేశా. వారితో ఉన్న స్నేహం కారణంగా.. పుట్టినరోజు, లేదా ఏదైనా స్పెషల్‌ డే వచ్చినప్పుడు వారికి విషెస్‌ చెబుతూ సోషల్‌విూడియాలో పోస్ట్‌ పెట్టేదాన్ని. అలా, పెట్టడమే ఆలస్యం.. వారితో నేను రిలేషన్‌లో ఉన్నానంటూ వార్తలు వచ్చేవి. అదృష్టంకొద్దీ ఇప్పుడు ఆ తారలకు పెళ్లి కూడా అయింది అని ఆమె నవ్వుతూ చెప్పారు.

చెన్నైకు చెందిన ప్రియా భవానీశంకర్‌.. ‘మేయాద మాన్‌’తో నటిగా తెరంగేట్రం చేశారు. 2023లో విడుదలైన ‘కళ్యాణం కమనీయం’తో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన ఆ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. అనంతరం ఆమె ‘ధూత’లో నాగచైతన్య సతీమణిగా కనిపించి ప్రేక్షకులను అలరించారు.