తమిళ పరిశ్రమలో వేధింపులు ఉంటే చెప్పండి: చర్యలు తీసుకుంటామన్న నటుడు విశాల్‌

మలయాళ సినీరంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపుల పై జస్టిస్‌ హేమ కమిటీ సమర్పించిన నివేదిక అక్కడి ఇండస్టీన్రి కుదిపివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్మ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మోహన్‌లాల్‌పాటు మొత్తం 17 మంది పాలక మండలి సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. కమిటీలోని కొంతమంది సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వారందరూ రాజీనామా చేశారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో కోలీవుడ్‌ నటుడు విశాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మాలీవుడ్‌లో హేమ కమిటీ తరహాలలో కోలీవుడ్‌లో 10 మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తాం. తమిళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ ఉన్నట్టు మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. కేరళలో ఏర్పాటు చేసిన హేమ కమిటీ లాగే తమిళనాడు నడిగర్‌ సంఘం ఆధ్వర్యంలో కమిటీ పెడతాం. నటీమణులు ఏవైనా సమస్యలు ఉంటే మాకు ఫిర్యాదు చేయండి. విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని విశాల్‌ స్పష్టం చేశాడు.

కేరళలో మహిళలను వేధించిన వారికి శిక్ష పడాల్సిందే. మహిళలకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతీ మగవారిపై ఉంటుందని సూచించాడు. మాలీవుడ్‌లో మహిళల లైంగిక వేధింపులతోపాటు పారితోషికాల్లో వివక్ష, షూటింగ్‌ లొకేషన్లలో కనీన సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హేమ కమిటీ నివేదికలో పేర్కొంది.