ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప -2 ది రూల్’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్తో నడుస్తుంది. ఇక నార్త్ సౌత్ అని తేడా లేకుండా అన్ని థియేటర్లలో హౌజ్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా ప్రదర్శితమవుతున్న ముంబై బాంద్రాలోని గెలాక్సీ థియేటర్ లో పెప్పర్ స్ప్రే కలకలం రేపింది. సినిమా సెకండ్ ఆఫ్కి ముందు.. గుర్తు తెలియని వ్యక్తి థియేటర్లో పెప్పర్ స్ప్రే చేశాడు. దీంతో అక్కడ ఉన్న ప్రేక్షకులు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతూ.. కొంతమంది దగ్గుతూ థియేటర్ బయటికి పరుగులు తీశారు. దీంతో థియేటర్ యాజమాన్యం పెప్పర్ స్ప్రే ఘాటును తొలగించే ప్రయత్నం చేయడంతో పాటు 30 నిమిషాల వరకు సినిమా ప్రదర్శనను నిలిపివేసింది.
అనంతరం మళ్లీ ప్రదర్శించింది. ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానం ఉన్నవారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.
