నన్ను టార్గెట్ చేసి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు అంటూ ఎమోషనల్ అయిన హీరో శింబు!

తమిళ స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించి మంచి ఆదరణ దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా శింబు వెంకటేష్ ప్రభు దర్శకత్వంలో మానాడు అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని ప్రతి ఒక్క ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని ఈ చిత్రం ద్వారా అందించ బోతున్నామని ఈ సందర్భంగా శింబు తెలియజేశారు. ఇకపోతే ఎప్పటి నుంచో వెంకటేష్ ప్రభు దర్శకత్వంలో సినిమా చేయాలని భావించాను ఇన్ని రోజులకు ఆ అవకాశం లభించిందని వెల్లడించారు. అప్పటి వరకు ఎంతో సరదాగా మానాడు చిత్రం గురించి మాట్లాడిన శింబు ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా వేదికపై ఆయన మాట్లాడుతూ కొందరు కావాలనే నన్ను టార్గెట్ చేస్తూ ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. అయితే వాళ్ల సంగతి నేను చూసుకుంటాను. నా సంగతి మీరు చూసుకోండి అంటూ సినిమా గురించి ప్రేక్షకులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. అయితే వేదికపై శింబు ఉన్నఫలంగా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకోవడంతో అక్కడే ఉన్నటువంటి పలువురు ఆయనను ఓదార్చారు.అయితే అతనిని ఇబ్బందులకు గురి చేస్తున్న వారు ఎవరు ఏమిటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.