‘పుష్ప-2’ షూట్‌లో బిజీగా అల్లు అర్జున్‌… తదుపరి చిత్రంపై ఇప్పటి నుంచే ప్లాన్‌!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘పుష్ప-2’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. జాతర నేపథ్యంలో సాగే పాటను చిత్రీకరిస్తున్నారు. అల్లు అర్జున్‌, రష్మిక మందన్నాపై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేసేలా షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేస్తున్నారు.

‘పుష్ప-2’ తర్వాత బన్నీ చేయబోయే చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. జవాన్‌ తో సూపర్‌హిట్‌ అందుకున్న యంగ్‌ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఉంటుందని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతోందట.

ఇందులో బన్నీ ఓ కొత్త లుక్‌లో కనిపించనున్నారని సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం ప్రారంభించాలని అట్లీ అనుకుంటున్నారట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయనీ.. త్వరలోనే దీనికి సంబంధిత వార్తలు వెల్లడించనున్నారని టాక్‌ వినిపిస్తోంది.

‘పుష్ప-2’ షూటింగ్‌ పూర్తి కాగానే అట్లీ ప్రాజెక్ట్‌పై బన్నీ పూర్తి దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ‘జవాన్‌’ విజయం సాధించిన సందర్భంగా అల్లు అర్జున్‌ జవాన్‌ టీమ్‌ను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. ఆ పోస్ట్‌కు అట్లీని, మ్యూజిక్‌ దర్శకుడు అనిరుధ్‌ను ట్యాగ్‌ చేసి నా సినిమాకు కూడా ఇలానే మ్యూజిక్‌ అందించాలని పేర్కొన్నారు.