సందీప్ రెడ్డి వంగా.. ఇక వాళ్ళతోనే..

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి దర్శకుడిగా అడుగుపెట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ దర్శకుడు ఆ ఒక్క సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసాడు అని చెప్పాలి. ఇక అదే సినిమాని హిందీలో టి-సిరీస్ లో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ టైటిల్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ సినిమాతో షాహిద్ కపూర్ కెరియర్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమాతో టి-సిరీస్ కి కూడా సందీప్ రెడ్డి వంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు.

దీంతో టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగాని ఏకంగా లాక్ చేసేశాడు. వరుసగా అతనితో సినిమాలు చేయడానికి ఒప్పందం చేసుకోవడం సంచలనంగా మారింది. ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి యానిమల్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఆగష్టులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాని సందీప్ రెడ్డి వంగా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆ సినిమాని కూడా టి-సిరీస్ బ్యానర్ లో భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతూ ఉండటం విశేషం. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలే. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మూవీ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని కూడా భూషణ్ కుమార్ నే నిర్మిస్తూ ఉండటం గమనార్హం.

ఇలా సందీప్ రెడ్డి వంగాతో టి-సిరీస్ ఏకంగా నాలుగు సినిమాలు ఒప్పందం చేసుకుందనే మాట వినిపిస్తుంది. ఒక్క కబీర్ సింగ్ సక్సెస్ తో బాలీవుడ్ సందీప్ రెడ్డి ఈ రేంజ్ లో నిర్మాతలని ఆకట్టుకోవడం సంచలనం అని చెప్పాలి. టాలీవుడ్ నుంచి ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ మాత్రమే బాలీవుడ్ లో ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యి అక్కడి నిర్మాతలని మెప్పించాడు. మళ్ళీ ఆ క్రెడిట్ సందీప్ రెడ్డికె దక్కడం విశేషం.