బాలీవుడ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న లండన్ ఈవెంట్ ‘బాలీవుడ్ బిగ్ వన్’ వాయిదాపడటం హాట్ టాపిక్ అయింది. మే 4, 5 తేదీల్లో అట్టహాసంగా నిర్వహించాల్సిన ఈ ప్రదర్శన అనూహ్యంగా నిలిపివేయబడి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈవెంట్ వాయిదా విషయాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం గమనార్హం.
సల్మాన్ ప్రకటన ప్రకారం, పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఏర్పడిన తాజా పరిస్థితుల మధ్య ఈవెంట్ను కొనసాగించటం సరికాదని భావించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజల భద్రత తమకు మొదటి ప్రాధాన్యత అని, అభిమానుల నిరాశను తాను అర్థం చేసుకుంటున్నానని పేర్కొన్నారు. త్వరలోనే ఈవెంట్కు కొత్త తేదీలను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ప్రోగ్రామ్లో సల్మాన్తో పాటు మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, కృతి సనన్, టైగర్ ష్రాఫ్ తదితర స్టార్లు పాల్గొనాల్సి ఉంది. భారీ స్థాయిలో ఆర్గనైజ్ చేసిన ఈ ఈవెంట్ టికెట్ల విక్రయం కూడా వేగంగా సాగుతున్న సమయంలో వాయిదా పడటం చర్చనీయాంశమైంది. లండన్లోని భారత, పాక్ మద్దతుదారుల మధ్య కూడా పహల్గామ్ ఘటన నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొనడం ఈ నిర్ణయానికి కారణమైంది.
ఇదే సమయంలో బాలీవుడ్లో కూడా పలు ఫంక్షన్లు, ప్రమోషనల్ ఈవెంట్లు రద్దు కావడం గమనించవచ్చు. పహల్గామ్ ఘటన దేశాన్ని కదిలించడమే కాకుండా, ఇతర రంగాలపై కూడా ప్రభావం చూపుతున్న తీరును ఈ లండన్ ఈవెంట్ వాయిదా స్పష్టం చేస్తోంది.