ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు భారత క్రికెట్ జట్టు అనేక అనుమానాలతో కూడిన పరిస్థితిలో ఉంది. శ్రీలంకతో వన్డే సిరీస్ అలాగే న్యూజిలాండ్తో హోమ్ టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటముల అనంతరం టీమిండియా సీనియర్ల భవిష్యత్తుపై ప్రశ్నలు వచ్చాయి. కానీ ఆదివారం నాటి ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి, నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో భారత క్రికెట్ మళ్లీ అగ్రస్థానాన్ని చేరుకుంది.
టోర్నమెంట్ ప్రారంభానికి ముందే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై ఊహాగానాలు వెల్లువెత్తాయి. వారి రిటైర్మెంట్ గురించి అనేక ఊహాగానాలు వచ్చాయి. కానీ భారత్ విజయం అనంతరం వీరిద్దరూ మౌనం వీడుతూ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయోత్సవం సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, జట్టు మంచి ఫామ్ లో ఉందని, తమ అనుభవాన్ని పంచుకోవడం వల్ల యువ ఆటగాళ్లు మరింత మెరుగుపడుతున్నారని చెప్పాడు.
ఆసీస్ టూర్ తరువాత మళ్లీ బలంగా తిరిగి రావాలనే ఉద్దేశంతో ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలని పట్టుదలతో ఉన్నామని వివరించాడు. “ఈ టీమ్ చాలా టాలెంట్తో నిండి ఉంది. ప్రతీ ఆటగాడు తన స్థాయిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మేము సీనియర్ ఆటగాళ్లుగా తమ అనుభవాన్ని పంచుకోవడం ఇష్టపడతాం. ఇలాంటి టైటిల్స్ కోసం ఆడటమే అసలైన క్రికెట్ మజా. ఒత్తిడిలో నిలబడి రాణించడమే నిజమైన సవాల్. ఈ టోర్నమెంట్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో కీలక ప్రదర్శన ఇచ్చారు. మా కృషికి ఇంతటి ఫలితం రావడం ఆనందంగా ఉంది” అని కోహ్లీ పేర్కొన్నాడు.
వీరి భవిష్యత్తుపై కోహ్లీ మరింత క్లారిటీ ఇస్తూ, జట్టు వచ్చే ఎనిమిదేళ్లపాటు ప్రపంచస్థాయిలో రాణించే స్థాయిలో ఉందని చెప్పాడు. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య తదితరులు అద్భుత ప్రదర్శన ఇచ్చారని, వారితో టీమిండియా మరింత శక్తిమంతంగా మారిందని వివరించాడు. రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన రాకపోయినా, భవిష్యత్తులో వారు మద్దతుగా ఉంటారని సంకేతాలు ఇచ్చారు. ఇది చూస్తే, 2027 వన్డే వరల్డ్ కప్ వరకు వీరు కొనసాగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.