Ajaz Khan: బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ మరోసారి తీవ్ర ఆరోపణలతో వార్తల్లో నిలిచాడు. ముంబైలో ఓ 30ఏళ్ల యువతి ఇచ్చిన ఫిర్యాదుపై చార్కోప్ పోలీసులు అతనిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. సినీ అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి పలుమార్లు లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆమె ఆరోపించింది. ఈ ఆరోపణలు బలంగా ఉండటంతో పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. త్వరలో అజాజ్ను విచారణకు పిలవనున్నారు.
ఇప్పటికే వివాదాల మధ్యలో ఉన్న అజాజ్ ఖాన్ తాజాగా హోస్ట్ చేసిన ‘హౌజ్ అరెస్ట్’ అనే వెబ్ షో కూడా హంగామాకు కారణమైంది. ఉల్లు యాప్లో స్ట్రీమ్ అయిన ఈ షోపై మహిళలను అసభ్యంగా ప్రోత్సహించారని ఆరోపణలు వచ్చాయి. గౌతమ్ రవ్రియా అనే యాక్టివిస్ట్ ఫిర్యాదు చేయడంతో అజాజ్తో పాటు షో నిర్మాత రాజ్కుమార్ పాండే, ఉల్లు సీఈఓ విభు అగర్వాల్లపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది.
వివాదాస్పద క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళా కమిషన్ సీరియస్గా స్పందించింది. మహిళలను అగౌరవపరిచే విధంగా ఈ షో ఉండటంతో NCW మే 9న అజాజ్ ఖాన్, ఉల్లు ప్రతినిధులను విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. షోను ప్లాట్ఫారమ్ నుంచి తొలగించినప్పటికీ అజాజ్పై విమర్శలు కొనసాగుతున్నాయి. గతంలో కూడా డ్రగ్స్ కేసు (2018), టిక్టాక్ వివాదం (2019) వంటి చీకటి మరకలు అజాజ్ ఖాన్ కెరీర్ను కలవరపరిచాయి. ఇప్పుడు అత్యాచారం కేసు, వెబ్ షో ఆరోపణలు అజాజ్ను మరింత కష్టాల్లోకి నెట్టాయి.