ఆ ఇల్లు నాది అంటున్న రమాప్రభ

టాలీవుడ్ లో సీనియర్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి రమాప్రభ. నటిగా ఆమె వందలాది సినిమాల్లో నటించారు. ప్రస్తుతం వృద్ధాప్యంలో సినిమాలకి దూరంగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఆమె స్టార్ట్ చేసి నడుపుతున్నారు.

ఆ ఛానల్ లో తనకి సంబంధించిన అన్ని విషయాలను రమాప్రభ ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం సీనియర్ యాక్టర్ శరత్ బాబు మృతి చెందిన సంగతి అందరికి తెలిసిందే. శరత్ బాబు రమాప్రభ ప్రేమించి పెళ్లి చేసుకుని కొంత కాలానికి విడిపోయారు.

అప్పటి నుంచి రమాప్రభ మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నారు. శరత్ బాబు అయితే ఇంకో పెళ్లి చేసుకున్నారు. తాజాగా శరత్ బాబు మృతి చెందిన తర్వాత ఆయన అంత్యక్రియలు చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నైలో ఉన్న ఓ ఇల్లు శరత్ బాబుది అంటూ సోషల్ మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి.

దీనిపై రమాప్రభ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రియాక్ట్ అయ్యారు. చెన్నైలో ఉన్న ఆ ఇల్లు తనది అని తెలియజేశారు. నేరుగా ఆ వార్తలపై కామెంట్స్ చేయకపోయినా పరోక్షంగా రమాప్రభ స్పందించడం విశేషం. చెన్నైలో తన ఇంట్లో ప్రస్తుతం చాలామంది ఉన్నారు. వారెవరు కూడా ఆ ఇల్లు రమాప్రభది అని చెప్పే ధైర్యం చేయడం లేదని విమర్శలు చేశారు. అది తన ఇల్లు కాదంటూ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే నవ్వొస్తుంది అన్నారు.

తనకు రజనీకాంత్ ఆర్థిక సాయం చేశాడంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదని రమాప్రభ పేర్కొన్నారు. 13 ఏళ్ల వయసు నుంచి తను సంపాదించడం మొదలు పెట్టానని, ఇప్పుడు చాలామంది తన గురించి ఇష్టానుసారంగా ఏది పడితే అది చెబుతూ సంపాదించుకుంటున్నారు అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కొన్ని సంఘటనలు చూసినప్పుడు జాలేస్తుంది ఒక్కోసారి నవ్వొస్తుంది. కొన్నిసార్లు బాధనిపిస్తుంది. అయినా ఏదో ఒక విధంగా తన పేరు పాపులర్ అవుతుంది అంటూ ఆమె ఆసక్తికరంగా చెప్పడం విశేషం. ఇప్పుడు రమాప్రభ శరత్ బాబు మృతుని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.