సల్మాన్‌, రజనీలతో అట్లీ మల్టీస్టారర్‌!?

‘జవాన్‌’ విజయం తర్వాత దర్శకుడు అట్లీ చేయనున్న చిత్రంపై స్పష్టత వస్తోంది. ఆయన సల్మాన్‌ ఖాన్‌తో ఓ మల్టీస్టారర్‌ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇందులో మరో హీరోగా దక్షిణాది నటుణ్ని తీసుకోనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇప్పుడీ పాత్ర కోసం అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ను రంగంలోకి దింపనున్నట్లు సమాచారం అందుతోంది.

ప్రస్తుతం ఈ విషయమై రజనీతో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది భారతీయ చిత్రసీమలో మరో క్రేజీ మల్టీస్టారర్‌గా నిలవనుంది. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్‌ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాదిలో సినిమాని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. దీన్ని సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మించనున్నారు. ప్రస్తుతం రజనీ నటించిన ‘వేట్టయాన్‌’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘కూలీ’ చిత్రీకరణ ప్రారంభించుకోవాల్సి ఉంది.