R Narayana Murthy: తాజాగా నటుడు ఆర్ నారాయణ మూర్తి గద్దర్ అవార్డులు ఇచ్చినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే శనివారం గద్దర్ అవార్డులపై ఆయన మాట్లాడారు. అదే సమయంలో థియేటర్ల సమస్యలపై స్పందించారు. గద్దర్ అవార్డుల విజేతలకు అభినందలు తెలిపారు. అలాగే ఏపీలోనూ నంది అవార్డులు ఇవ్వాలని కోరారు. పర్సంటేజీల విషయంలో ఈ మధ్య వివాదం నెలకొంది. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దం.
పర్సంటేజిలు ఖరారు అయితే నా లాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుంది. అదేవిధంగా పవన్ కార్యాలయం నుంచి ఆ ప్రకటన రావడం సమంజసంగా లేదు. హరిహర వీరమల్లు సినిమా కోసం కాకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం రావాలని పిలిస్తే పవన్ పై గౌరవం మరింత పెరిగేది అని నారాయణమూర్తి అన్నారు. భారతదేశంలో సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి దొరికే విధానం. పర్సంటేజి విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒక్కణ్ణి. పర్సంటేజిల విషయంలో ఛాంబర్ ముందు టెంటు వేసి ఆందోళనలు చేశాము.
ఎంతో మంది ఛాంబర్ ప్రెసిడెంట్ లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు. పర్సంటేజి విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో హరిహర వీరమల్లుకు లింకు పెట్టడం సరికాదు. పరిశ్రమ పెద్దలు సీఎం చంద్రబాబును కలువాలని అనడంలో తప్పులేదు. మేం మీ బిడ్డలం. పర్సంటేజి విషయాన్ని పక్కదారి పట్టించవద్దు అని నారాయణ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే నారాయణమూర్తి వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.