అల్లు స్థాయికి తగ్గరీతిలో ‘పుష్పా2’…అవార్డుతో మరింత శ్రద్ద పెట్టిన డైరెక్టర్‌

సూపర్‌సక్సెస్‌ చిత్రం ‘పుష్ప’కు కొనసాగింపుగా ‘పుష్పా2’ చిత్రం తెరకెక్కుతున్నది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం సాధించిన విజయంతో దానికి రెట్టింపు ‘పుష్పా2’ ఉండేలా దర్శకుడు సుకుమార్‌ శ్రద్ద తీసుకుంటున్నారు. అంతే కాదు.. ఈ చిత్రంతో హీరో అల్లు అర్జున్‌ కి ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డ్‌ రావడం, తెలుగు చిత్ర పరిశ్రమకు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం ఇదే తొలిసారి కావడంతో బాధ్యత, ఒత్తిడి దర్శకుడు సుకుమార్‌పై మరింత పెరిగింది. దీంతో రెట్టింపు కష్టపడుతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీ లో జరుగుతోంది. ఏ సినిమాకైనా పాట, ఫైట్‌ అంటే భారీతనం ఉండాల్సిందే! ఇక జాతర నేపథ్యంలో సాగే పాటంటే జాతరలో ఉన్నంత సందడి కనిపించాల్సిందే! ప్రస్తుతం ‘పుష్ప 2’ సెట్‌లో అదే జరుగుతోంది. సుమారు వెయ్యిమంది డ్యాన్సర్లపై జాతర నేపథ్యంలో సాగే పాటను తెరకెక్కిస్తున్నారు. గణెళిశ్‌ ఆచార్య నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. నెల రోజులకు పైగా సాగే ఈ షెడ్యూల్‌లో పాటతోపాటు పోరాట ఘట్టం, కీలక సన్నివేశాల్ని కూడా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.

‘పుష్ప’కి దీటుగా ఉండేలా ‘పుష్ప2’ చిత్రాన్ని రూపొందించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 2021లో విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. భారతీయ బాక్సాపీస్‌ వద్ద 350కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ పురస్కారాన్ని గెలుచుకొని సరికొత్త రికార్డు సృష్టించారు. ‘పుష్ప’ చిత్రంలో అసమాన అభినయానికిగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన తొలి తెలుగు నటుడిగా నిలిచారు.