ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌.. పూజా కార్యక్రమలతో ప్రారంభం!

జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్లో ‘ఎన్టీఆర్‌31’ శుక్రవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ ఇరు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘కేజీఎఫ్‌’,’సలార్‌’ సినిమాలతో సక్సెస్‌ రేస్‌లో ఉన్న ప్రశాంత్‌ నీల్‌.. ఎన్టీఆర్‌తో సినిమాను ప్రకటించి చాలాకాలమైంది.

తారక్‌ ఆర్‌ఆర్‌ఆర్‌, తదుపరి దేవర చిత్రాలతో బిజీగా ఉండటం, నీల్‌ సలార్‌ షూటింగ్‌తో బిజీగా ఉండటంతో సినిమా ప్రారంభం డిలే అయింది. వీరిద్దరి కాంబినేషన్‌ లో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 2026 జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర బృందం తెలిపింది.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని అందరూ ఓ యాక్షన్‌ సినిమాలా భావిస్తారని నేను ముందే ఊహించాను. కానీ నేను నా జానర్‌లోకి వెళ్లాలనుకోవట్లేదు. నిజానికిది భిన్నమైన భావోద్వేగాలతో వైవిధ్యభరితంగా ఉండే చిత్రంగా ఉంటుంది. నాకిది చాలా కొత్త కథ‘ అని అన్నారు.

‘ఎన్టీఆర్‌31’ వర్కింగ్‌ టైటిల్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘డ్రాగన్‌’ అనే పేరు ఖరారు చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే టైటిల్‌ ఏంటనేది ఇంకా వెల్లడించలేదు. . ఈ చిత్రాన్ని కూడా ప్రశాంత్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తారని టాక్‌ నడుస్తోంది.