రజనీకాంత్‌పై విఘ్నేష్‌ లైవ్‌ ఫాడ్‌కాస్ట్‌.. గిన్నిస్‌ రికార్డులో 50 గంటల నిర్విరామ ప్రదర్శన!

సినీ పరిశ్రమలో రజనీకాంత్‌కు ఉన్న ఫాలోయింగ్‌ తెలిసిందే. తన నటన, స్టైల్‌తో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ సూపర్‌ స్టార్‌పై ఉన్న అభిమానాన్ని ఓ నటుడు వినూత్నరీతిలో చాటి గిన్నిస్‌ రికార్డును(Guinness World Record) సొంతం చేసుకున్నారు. అతడి అభిమానానికి ఫిదా అయిన రజనీకాంత్‌ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక మెసేజ్‌ పంపారు. నటుడు విఘ్నేశ్‌(RJ Vigneshkanth) చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకులు, నటులు, రజనీ వీరాభిమానులతో లైవ్‌ పాడ్‌కాస్ట్‌ నిర్వహించారు. నిర్విరామంగా 50 గంటల పాటు తలైవాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. సెప్టెంబర్‌ 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం సెప్టెంబర్‌ 8 సాయంత్రం 8 గంటల వరకు సాగింది. 50 గంటల లైవ్‌ చేసినందుకు విఘ్నేశ్‌ను అభినందిస్తూ దర్శకుడు శశికుమార్‌ గిన్నిస్‌ రికార్డు సర్టిఫికెట్‌ అందజేశారు.

ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్‌.. (Rajinikanth) విఘ్నేశ్‌కు ప్రత్యేకంగా వాయిస్‌ నోట్‌ పంపారు. ‘విఘ్నేశ్‌ మిమ్మల్ని ఎలా ప్రశంసించాలో నాకు అర్థం కావట్లేదు. విూ అభిమానానికి మాటలు రావడం లేదు. 50 గంటలు ఇంటర్వ్యూ చేశారంటే చిన్న విషయం కాదు. హ్యాట్సాఫ్‌ టు యూ. విూ అభిమానానికి ప్రతిఫలంగా నేనేం ఇవ్వాలో తెలియట్లేదు. ఎప్పటికీ విూరు నా హృదయంలో ఉంటారు. లవ్‌ యూ‘ అంటూ రజనీ ఆనందం వ్యక్తంచేశారు.

సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తలైవా వరుస చిత్రాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. టి.జి.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వెట్టయాన్‌’లో నటించారు. తెలుగులో ‘వేటగాడు’ పేరుతో ఇది అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషించారు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘కూలీ’లో చేస్తున్నారు. ఇందులో దేవా పాత్రలో కనిపించ నున్నారు. నాగార్జున.. సైమన్‌గా, కలీషాగా ఉపేంద్ర నటిస్తున్నారు. సత్యరాజ్‌, శ్రుతిహాసన్‌, సౌబిన్‌ షాహిర్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.