మళ్లీ బిజీ అవుతున్న నిత్యామీనన్‌!

ఆ మధ్య కాస్త నిదానించిన నిత్యామీనన్‌ గత ఏడాది ’తిరు’ సినిమాతో మళ్లీ జూలు విదిల్చింది. అటు తమిళంలో, ఇటు తెలుగులో మంచి హిట్‌ అందుకుంది. దాదాపు తన కెరీర్‌ ముగిసిందని అందరూ అనుకుంటున్న సమయంలో వచ్చిన ‘తిరు’ నిత్యామీనన్‌ కి మళ్లీ పెద్ద బ్రేక్‌గా నిలిచిందని చెప్పక తప్పదు. ఆ తర్వాత ’కుమారి శ్రీమతి’ వెబ్‌సిరీస్‌ కూడా తనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తమిళంలో జయం రవి హీరోగా తను నటిస్తున్న చిత్రం ‘కాదలిక్క నేరమిల్లె’. 60ఏళ్ల క్రితం ఇదే పేరుతో తమిళంలో ఓ చిత్రం రూపొందింది.

ఆ సినిమా ఇప్పటికీ అక్కడ క్లాసిక్‌. ఆ పేరుతో ఇప్పుడు సినిమా చేయడం అంటే నిజంగా సాహసమే. ఉదయ్‌నిధి స్టాలిన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయన భార్య కిరుతిగ ఉదయ్‌నిధి దర్శకురాలు. ఈ సినిమా గురించి నిత్యామీనన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ’మణిరత్నం ’ఓకే కణ్మని’ తర్వాత నేను చేస్తున్న పూర్తిస్థాయి ప్రేమకథ ఇది.

ఇందులో పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. కురితిగ అద్భుతమైన దర్శకురాలు. తను నా పాత్రను తీర్చిదిద్దిన తీరు అద్భుతం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేశాం. బహుశా సమ్మర్‌లో విడుదల ఉండొచ్చు. నేను మాత్రం ప్రేక్షకుల మధ్యలో కూర్చొని ఈ సినిమా చూస్తా’ అని చెప్పుకొచ్చింది నిత్యామీనన్