రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్‌ డాక్యమెంటరీ!

‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లతో ప్రపంచాన్ని ఆకర్షించిన రాజమౌళిపై నెట్‌ప్లిక్స్‌ డాక్యుమెంటరీ రూపొందించింది. దీని స్ట్రీమింగ్ తేదీని, ఇందులో ఏం చూపనున్నారో తెలుపుతూ తాజాగా ఆ సంస్థ పోస్ట్‌ పెట్టింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ పేరుతో ఇది రానున్నట్లు తెలిపింది.

‘ఒక మనిషి.. అనేక బ్లాక్‌బస్టర్‌లు.. అంతులేని ఆశయం. ఈ లెజెండరీ దర్శకుడు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇలాంటి అంశాలతో మోడ్రన్‌ మాస్టర్స్‌’ రూపొందింది. ఆగస్టు2 నుంచి నెట్‌ప్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది’ అని సంస్థ పేర్కొంది.

దీన్ని అనుపమా చోప్రా సమర్పించనున్నారు. ఈ డాక్యుమెంటరీలో పలువురు హాలీవుడ్‌ దర్శకులు, సినీ ప్రముఖులు రాజమౌళిపై వారి అభిప్రాయాలను తెలియజేయనున్నారు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు కూడా ఈ దర్శక ధీరుడితో వారి అనుబంధాన్ని పంచుకోనున్నట్లు తెలుస్తోంది.

రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో తీయనున్న ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా, హాలీవుడ్‌ ప్రముఖ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ కీలకపాత్ర పోషించనున్నారని కూడా జోరుగా ప్రచారమవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.