నాగార్జున మల్టీస్టారర్.! ఇంకోసారి ఆ రిస్క్ చేస్తాడా.?

అక్కినేని నాగార్జున చాలా సైలెంటుగా వచ్చి, మంచి హిట్ కొట్టేశాడు ఈ సంక్రాంతికి.! ‘నా సామి రంగ’ సినిమా సంక్రాంతికి విడుదలై, వసూళ్ళను బాగానే సాధించింది. ఓవర్ ఫ్లోస్ అనండీ, సంక్రాంతి సీజన్ అనండీ.. ఇంకోటైదేనా కారణం అనండీ.. ‘నా సామి రంగ’ చెప్పుకోదగ్గ లాభాల్నే ఆర్జించింది.

సంక్రాంతి హిట్ సినిమా.. అంటే, ఈ ఏడాది ‘హనుమాన్’ తర్వాత, ‘నా సామి రంగ’ అన్నది నిర్వివాదాంశం. ఈ ఉత్సాహంతోనే వచ్చే సంక్రాంతికీ తన సినిమా వుంటుందని అక్కినేని నాగార్జున తాజాగా ప్రకటించేశాడు.

ఇదిలా వుంటే, అక్కినేని నాగార్జున స్వీయ నిర్మాణంలో ఓ సినిమా ప్లాన్ చేశాడట. ఓ యంగ్ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కిస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నాగార్జునతోపాటు అక్కినేని నాగచైతన్య, అఖిల్ కూడా నటిస్తారని సమాచారం.

Akhil-Naga-Chaitanya

అన్నీ అనుకున్నట్టు జరిగితే, త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికార ప్రకటన రాబోతోంది. అయితే, నాగచైతన్య అలాగే అఖిల్ జస్ట్ గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారట. పది పదిహేను నిమిషాల నిడివి ఇద్దరికీ విడివిడిగా వుండబోతోందట.

ఈ ముగ్గురూ కలిసి తెరపై కనిపించడం ఇదే కొత్త కాదుగానీ, ఈసారి సమ్ థింగ్ స్పెషల్ అట.! అదేంటో తెలియాలంటే, సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది మరి.!