సిఎం రేవంత్‌రెడ్డితో నాగార్జున దంపతుల భేటీ..

పుష్పగుఛ్చం అందించి శుభాకాంక్షలు తెలిపిన నాగ్‌ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని నటుడు నాగార్జున తన భార్య అమల అక్కినేనితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. జూబిలీహిల్స్‌లోని సీఎం నివాసంలో నాగార్జున దంపతులు సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు.

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. రేవంత్‌రెడ్డిని సీఎంగా ప్రకటించిన సమయంలో టాలీవుడ్‌ నుంచి ముందుగా చిరంజీవి అభినందనలు తెలపడంతో పాటు.. ఇటీవల స్వయంగా తన ఇంటికి వెళ్లి ఆయనని అభినందించారు. మెగాస్టార్‌ చిరంజీవి తర్వాత రేవంత్‌ రెడ్డిని నాగార్జున ఇలా మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు అభినందనలు తెలియజేశారు.

నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 7న సీఎంతో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ రెండో సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకున్న రేవంత్‌ రెడ్డికి అన్ని వర్గాల నుండి అభినందనలు వెల్లువెత్తాయి.

సోషల్‌ విూడియా వేదికగా సెలబ్రిటీలు ఎందరో.. సీఎం రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి తర్వాత నాగార్జున.. ఇలా ఒక్కొక్కరుగా పర్సనల్‌గా రేవంత్‌ రెడ్డిని వీలు చూసుకుని కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కింగ్‌ నాగార్జున, అమల దంపతులు పుష్పగుచ్ఛంతో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.