‘లాల్‌ సలాం’ ఫెయిల్యూర్‌కు అదే కారణమా…?!

అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘లాల్‌ సలాం’ ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ దీనికి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేదు.

తాజాగా దీనిపై ఐశ్వర్య ఓ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు. 21 రోజుల షూటింగ్‌ ఫుటేజ్‌ పోయిందని దాని ప్రభావం సినిమా ఫలితంపై పడిందన్నారు. ‘సినిమాలోని ప్రధాన భాగానికి సంబంధించిన షూటింగ్‌ ఫుటేజ్‌ మిస్సయింది. దాదాపు 21 రోజుల ఫుటేజ్‌ అది. పూర్తి బాధ్యతారాహిత్యం కారణంగానే ఇలా జరిగింది. క్రికెట్‌కు సంబంధించిన సన్నివేశాలను 20 కెమెరాలతో నిజమైన మ్యాచ్‌లా షూట్‌ చేశాం. మా దురదృష్టం కొద్ది పోగొట్టుకున్నాం. మాకు ఏం చేయాలో అర్థంకాలేదు. అప్పటికే విష్ణు, నాన్న(రజనీకాంత్‌)తో సహా అందరూ గెటప్‌లు మార్చుకున్నారు. అందుకే రీ షూట్‌ చేయలేకపోయాం. చివరికి మిగిలి ఉన్న దానితో సినిమాను ఎడిట్‌ చేశాం’ అని చెప్పారు.

ఇక ఈ ‘లాల్‌ సలాం’పై వచ్చిన విమర్శల గురించి మాట్లాడుతూ.. ”వ్యక్తిగతంగా సినిమా విషయంలో సంతృప్తి చెందాను. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాం. అందుకే మలుపులు ఎక్కువ లేవు. కథంతా సూటిగా, సింపుల్‌గా ఉంటుంది. నేను విమర్శలను, ప్రశంసలను సమానంగా తీసుకుంటాను. నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ఈ చిత్రం సాయపడింది” అన్నారు. ఇటీవల కూడా ఐశ్వర్య ఈ సినిమా ఫెయిల్యూర్‌పై మాట్లాడుతూ.. రజనీకాంత్‌ పాత్ర కోసం మొదటరాసుకున్న స్క్రిప్ట్‌లో మార్పులు చేశామన్నారు. ఆయన కోసం సినిమాకు వచ్చేవారు నిరాశకు గురికాకూడదని ఆ పాత్రలో మార్పులు చేసి మొదటి నుంచి ఉండేలా స్క్రిప్ట్‌ ఎడిట్‌ చేసినట్లు తెలిపారు. దాని వల్ల ప్రేక్షకులు గందరగోళానికి గురైనట్లు చెప్పారు.