టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కలకలం.. రాడిసన్‌కు వెళ్లిన మాట వాస్తవమేనన్న క్రిష్‌!?

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కలకలం మరోసారి తెరపైకి వచ్చింది. గచ్చిబౌలి రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో పలువురు సినీ ప్రముఖుల పేరు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే హీరోయిన్‌ కుషిత కళ్ళపు చెల్లెలు లిషి గణెళిష్‌ పేరు వెలుగులోకి వచ్చింది.

తాజాగా టాలీవుడ్‌ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి పేరు కూడా తెరపైకి వచ్చింది. రాడిసన్‌ డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరందరికీ కొకైన్‌ విక్రయించిన అబ్బాస్‌ అలీపై కూడా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నిర్వహించిన దాడుల్లో మంజీరా గ్రూప్‌ డైరెక్టర్‌ వివేకానంద అనే వ్యక్తితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివేకానంద నిర్వహించిన పార్టీలో దర్శకుడు క్రిష్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ పెడ్లర్‌ అబ్బాస్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కూడా క్రిష్‌ పేరు ఉన్నట్లు తేలింది. అయితే దీనిపై క్రిష్‌ స్పందించారు. ‘నేను ఆ హోట్‌లకు వెళ్లిన మాట నిజమే. స్నేహితుల్ని కలవడానికి మాత్రం వెళ్లాను. సాయంత్రం అరగంట ఉండి 6.45 నిమిషాలకు నేను హోటల్‌ నుంచి బయటకు వచ్చేశాను.

ఈ విషయం పోలీసులు కూడా తెలియజేశాను. దీనిపై నన్ను ఒక స్టేట్‌మెంట్‌ అడిగారు అని క్రిష్‌ తెలిపారు. అయితే టాలీవుడ్‌ తారల డ్రగ్స్‌పై పోలీసులు దృష్టి సారించడం కలకలం రేపుతోంది. ఎప్పుడు ఎవరి పేరు బయటకు రానుందో అని ఉత్కంఠగా ఉంది.