బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ నటించిన తాజా చిత్రం జాట్ విడుదలైన కొద్ది రోజులకే పెద్ద వివాదంలో చిక్కుకుంది. జలంధర్లోని ఓ క్రైస్తవ సంఘం సభ్యుడు ఫిర్యాదు చేయడంతో, ఈ చిత్రంపై కేసు నమోదైంది. సినిమాలో మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. ఫిర్యాదులో దర్శకుడు గోపిచంద్ మలినేని, నటులు సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్తో పాటు నిర్మాతలపై కేసు పెట్టారు.
జాట్ సినిమాలో యేసు క్రీస్తుని అవమానించేలా ఓ సీన్ చిత్రీకరించారని, ఇది క్రైస్తవ సమాజాన్ని బాధించిందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వంటి క్రైస్తవుల పవిత్ర పర్వదినాల సమయంలోనే ఈ చిత్రాన్ని ఉద్దేశపూర్వకంగా విడుదల చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. భారతీయ న్యాయసంహితలోని సెక్షన్ 299 ప్రకారం కేసు నమోదు చేసినట్లు జలంధర్ పోలీసులు తెలిపారు.
ఈ యాక్షన్ డ్రామాలో సన్నీ డియోల్ ప్రధాన పాత్ర పోషించగా, ప్రతినాయకుడిగా రణదీప్ హుడా కనిపించారు. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా, జరీనా వహాబ్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించారు.
హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 10న విడుదలైన జాట్ మొదటి వారాంతంలో రూ.32 కోట్లకు పైగా వసూళ్లు సాధించి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. కానీ ఈ కేసుతో సినిమా మత వివాదంలో చిక్కుకున్నట్టయ్యింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తక్కువ సమయంలో మంచి కలెక్షన్లు సాధించిన ఈ సినిమా, ఇప్పుడు నెగటివ్ ప్రచారాన్ని ఎదుర్కొంటోంది.