మరోసారి రిపీట్ కాబోతున్న ఇస్మార్ట్ కాంబో..!

తెలుగు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. రామ్ కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్. అయితే ఈ సినిమా తర్వాత పూరీ మళ్లీ ఫాంలోకి వచ్చాడని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా తీశాడు. అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూసిన ఆ చిత్రం ప్లాప్ గా నిలిచింది. దీంతో మళ్లీ పూరి ప్లాపులకు సొంతం అయ్యాడు.

దాని నుంచి కోలుకొని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని పూరీ ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ స్పెషల్ స్టోరీ రాసుకున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో హీరోగా రామ్ ను అనుకున్నాడట దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈ క్రమంలోనే ఈ సినిమా కథను అతడికి చెప్పడంతో రామ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కాసేపటి క్రితమే ఈ విషయం తెలియగా క్షణాల్లోనే వైరల్ గా మారింది.

మాస్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా అంటే చాలా మందికి ఇప్పటికీ ఇష్టమే. అయితే రామ్ హీరోగా, పూరీ డైరెక్టర్ గా మరోసారి కాంబో రిపీట్ అవుతుందని తెలిసినప్పటి నుంచి రామ్ ఫ్యాన్స్ తో పాటు మాస్ ను ఇష్టపడే అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. కానీ ఈ చిత్రానికి సంబంధించి అటు డైరెక్టర్ నుంచి కానీ ఇటు హీరో నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

అంతే కాదండోయ్ ఈ సినిమా కథ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఉండబోతోందని… ఎలాగైన మరోసారి హిట్టు కొట్టి తన ఉనికిని చాటుకునేందుకు పూరీ చాలా ఆసక్తిగా ఉన్నారట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్లను అధికారికంగా ప్రకటిస్తారని టాలీవుడ్ కోడై కూస్తోంది.

ప్రకటన వెలువడిన వెంటనే రామ్, పూరీ సినిమా ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా 2023 దసరా సందర్భంగా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తవగానే పూరీతో సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరగనుందో.