Mohan Babu: ఈ మధ్యకాలంలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గురించి ఏ చిన్న వార్త వచ్చినా తెగ వైరల్గా మారితోంది. మా అసోసియేషన్ ఎన్నికల నుంచి వీరిపైన ఏదో ఒక విధంగా ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. వాటికి బదులుగా ఈ ఫ్యామిలీ దానికి తగ్గట్టుగా సమాధానం ఇస్తూనే వస్తోంది. ఇటీవల వారి దగ్గర పనిచేసే హెయిర్ స్టైలిస్ట్ వివాదం కూడా తీవ్ర స్థాయిలో దుమారం రేపిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో పలు విశ్వ బ్రాహ్మణ సంఘాలు మోహన్ బాబు తమ కులాన్ని కించపరిచందుకు గానూ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆ తర్వాత సినిమా టికెట్ ధరల విషయంలోనూ మంచు విష్ణు ఎలాంటి విషయాలూ పట్టించుకోవట్లేదనే వార్తలు అప్పట్లో సంచలనం రేపాయి.
ఇకపోతే తాజాగా విలక్షణ నటుడు మోహన్ బాబు 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ కళాశాల అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆయన పుట్టినరోజు వేడుకలకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, జీఆర్ గ్రూప్స్ అధినేత అమరనాథ రెడ్డి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవి శంకర్ ముఖ్య అతిథిలుగాహాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆయన చెప్పుకొచ్చారు.
అలా మాటల మధ్యలో తనకు గురువుగా భావించే దాసరి నారాయణ రావును గుర్తు చేసుకొని మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు. దాదాపు 7ఏళ్లు తిండిలేక, కేవలం రెండు జతల బట్టలతో కారు షెడ్లో ఉంటూ, ఏదైనా సాధించాలనే పట్టుదలతో మద్రాసు బాట పట్టిన తనకు దాసరి గారు పరిచయమయ్యి తనకెంతో మేలు చేశారని ఆయన కొనియాడారు. తన జీవితం ఎప్పుడు చూసినా సమస్యల వలయంగా ఉండేదన్న ఆయన, తాను ఎంతో మందికి సహాయపడ్డానని, కానీ వారెవరూ కూడా తనకు కావాల్సిన సమయంలో సహాయపడలేదని ఆయన ఆవేదన చెందారు. 30 ఏళ్ల క్రితం తాను స్థాపించిన శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నేడు యూనివర్సిటీ స్థాయికి ఎదగడం వెనక ఎంతో శ్రమ ఉందని మోహన్బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్న, నరేష్, అలీ తదితరులు పాల్గొన్నారు.
