ఓటిటిలోకి వచ్చేసిన ‘మిస్టర్‌ బచ్చన్‌’

ఎన్నో అంచనాల మధ్య గత నెల ఆగస్టు15న ప్రేక్షకుల ముందుకు వచ్చి బోర్లా పడిన చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ ఒటిటిలోకి వచ్చేసింది. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో మాస్‌ మహారాజ రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ సినిమాను పీపుల్స్‌ విూడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీ.జి.విశ్వప్రసాద్‌ నిర్మించారు. 2018లో అజయ్‌ దేవవ్‌గణ్‌ హీరోగా హిందీలో సూపర్‌ హిట్‌ అయిన రైడ్‌ చిత్రాన్ని కాస్త మార్పులు చేసి తెలుగులో రీమేక్‌ చేశారు. సినిమా షూటింగ్‌ ప్రారంభం నుంచి ఈ సినిమా నుంచి వచ్చిన ఆప్డేట్లు, పాటలు, ప్రచార కార్యక్రమాలు సినిమాపై బాగా హైప్‌ తీసుకు రాగా థియేటర్లోకి వచ్చి తీవ్రంగా నిరాశ పర్చింది.

ఇప్పుడు ఈ సినిమా ఈ గురువారం నుంచి ఓటీటీలోకి వచ్చింది. కథ విషయానికి వస్తే.. ఓ నిజాయితీ అధికారి, అవినీతి ఎంపీ మధ్య జరిగే క్యాట్‌ అండ్‌ మౌస్‌ గేమ్‌ ఈ చిత్రం. రాజకీయంగా అందరినీ శాసించే క్రూరుడు, అధికారులని ఓ రేంజ్‌లో భయపెట్టే ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంటిపై నిజాయితీ గల అధికారి బచ్చన్‌ రైడ్‌కు వెళతాడు.ఈ క్రమంలో బచ్చన్‌ ఆ ఇంట్లో రైడ్‌ చేయగలిగాడా, అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే కథ.

అదే సమయంలో తన ఊరిలో ఓ మార్వాడి అమ్మాయితో బచ్చన్‌ ప్రేమ వ్యవహారం, సత్య కామెడీ ట్రాక్‌ ఇంకా ఓ నాలుగైదు క్యారుకట్లు చుట్టూ సినిమా సాగుతుంది. ఇప్పుడీ సినిమా నెట్‌ ప్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే.. సినిమా అంతా మొదటి నుంచి చివరి వరకు రవితేజ మయంగా కనిపిస్తుంది. ప్రేక్షకులు రవితేజను ఎలా చూడాలనుకుంటారో దర్శకుడు అలానే చూపించాడు కూడా.

కానీ ఆయన క్యారెక్టర్‌ ముందు ఇతర పాత్రలన్నీ తేలిపోయాయి. ఉన్నంతలో భాగ్యశ్రీ అందం, అమాయకపు నటన, పాటల్లో ఒలకబోసిన గ్లామర్‌, డ్యాన్స్‌ పెద్ద ఎస్సెట్‌. ఆ తర్వాత సత్య కామెడీ ఫస్టాఫ్‌ను నిలబెట్టగా సినిమా మొత్తానికి మిక్కీ జే మేయర్‌ సంగీతం చాలా బలాన్ని చేకూర్చింది. సినిమా థియేటర్లలో చూడని వారు, ఎలాంటి అంచనాలు లేకుండా ఈ’మిస్టర్‌ బచ్చన్‌’ మూవీని ఒక్కసారి చూసేయవచ్చు.