కొడుకు పుట్టాక మార్పు వచ్చిందన్న నిఖిల్‌!

తండ్రి అయిన తర్వాత తనలో ఎంతో మార్పు వచ్చిందని హీరో నిఖిల్‌ అన్నారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నా.. ఇంట్లో వాళ్లతో సమయం గడపడానికే ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తన కుమారుడి కోసం కొన్ని అలవాట్లను మార్చుకున్నట్లు తెలిపారు. ‘మా అబ్బాయి పేరు ధీర సిద్దార్థ్‌. వాడు పుట్టిన దగ్గర నుంచి తన కోసమే సమయాన్ని కేటాయిస్తున్నాను. ఎంతో త్వరగా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది.

పిల్లాడి బాధ్యతను పంచుకోవడానికి నావంతు ప్రయత్నం చేస్తున్నాను. వారానికి ఒక్కసారైనా పార్టీకి వెళ్లడం నాకు అలవాటు. ఇప్పుడు పూర్తిగా వెళ్లడం మానేశాను. తల్లిదండ్రులుగా మారిన తర్వాత కొన్ని అలవాట్లను వదులుకోవాల్సి వస్తుంది. పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచాలంటే కొన్నిటికి దూరం కావాలి. ఇప్పుడు నేను అన్నిరకాలుగా ఆనందంగా ఉన్నాను. నా జీవితం ఇలా ఉంటుందని 15 ఏళ్ల క్రితమే ఎవరైనా చెబితే ఇన్ని సంవత్సరాలు ఇంత ఒత్తిడికి గురయ్యేవాడిని కాదు’ అని చెప్పారు.

ప్రస్తుతం నిఖిల్‌ ‘స్వయంభు’లో నటిస్తున్నారు. దీని షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న ఈ చిత్రానికి భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త కథానాయిక. నభానటేష్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ చిత్రంలో నిఖిల్‌ ఓ యోధుడిగా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం తను ఇప్పటికే మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. దీని తర్వాత ‘కార్తికేయ3’లో నటించేందుకు సిద్ధమవుతున్నారు.