గ్యాంగ్‌ మధ్య స్టోరీ.. ధనుష్‌ రాయన్‌!

నటుడిగా,గాయకుడిగా, దర్శకుడిగా ఆలౌరౌండర్‌ అనిపించుకుంటున్న కథానాయకుడు ధనుష్‌. అందుకే అలవోకగా 49 చిత్రాలు పూర్తి చేశాడు. స్వీయ దర్శకత్వంలో 50వ చిత్రంగా ’రాయన్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక పేద కుటుంబానికి చెందిన రాయన్‌ (ధనుష్‌)కు ఇద్దరు తమ్ముళ్లు (సందీప్‌కిషన్‌, కాళిదాస్‌ జయరామ్‌), ఒక చెల్లి (దుషారా విజయన్‌). చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమవుతారు. టౌన్‌కి వెళ్లొస్తామని చెప్పి మళ్లీ తిరిగిరారు.

ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు రాయన్‌ చేత కత్తిపట్టిస్తాయి. భయపడకుండా పోరాటం చేయడం అప్పట్నుంచే అలవాటవుతుంది. తన తోబుట్టువులకు అన్నీ తానై, ముగ్గురినీ వెంట పెట్టుకుని టౌన్‌కి చేరుకుంటాడు రాయన్‌. ఓ మార్కెట్లో పనిచేస్తూ నలుగురూ అక్కడే పెరిగి పెద్దవుతారు. అక్కడ దురై (శరవణన్‌), సేతు (ఎస్‌.జె.సూర్య) గ్యాంగ్స్‌ మధ్య ఎప్పట్నుంచో ఆధిపత్య పోరాటం కొనసాగుతుంటుంది. ఆ గొడవలు రాయన్‌ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేశాయి? తన తమ్ముళ్లు, చెల్లెలు కోసం రాయన్‌ ఏం చేశాడు? రాయన్‌ కోసం వాళ్లు ఏం చేశారు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ప్రతీకారంతో ముడిపడిన గ్యాంగ్‌ వార్‌ కథలు, అందులో ఉండే పాత్రల మధ్య సంఘర్షణ ఆ సినిమా విజయానికి కొలమానంగా నిలుస్తాయి. క

థగా చూస్తే ’రాయన్‌’లో కొత్తదనం లేకపోయినా, కొన్ని మలుపులు, కుటుంబ డ్రామా, కథా నేపథ్యం ప్రత్యేకంగా మార్చేశాయి. ప్రథమార్ధం చాలావరకూ ఆయా పాత్రలు, వాటి ప్రపంచాన్ని పరిచయం చేయడానికే పరిమితమైంది. రాయన్‌ కుటుంబానికి దురై గ్యాంగ్‌ నుంచి సవాలు ఎదురు కావడం నుంచే అసలు కథ మొదలవుతుంది. విరామానికి ముందు వచ్చే ఆ సన్నివేశాలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లడంతోపాటు, ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచుతాయి.

దురైతో పోరాటం తర్వాత సింహంలా బలంగా కనిపించిన రాయన్‌, ఆ తర్వాత తోడేల్లాంటి సేతు (ఎస్‌.జె.సూర్య) ఎత్తులకు దొరికిపోయాడా?లేదా?అనే విషయాలు కీలకం. ప్రథమార్ధం వరకూ ఒక సాధారణ అన్నదమ్ముల కథ అనిపించినా, ద్వితీయార్ధంలోకి వచ్చేసరికి సరికొత్త డ్రామాతో కథాగమనాన్ని మార్చేశాడు దర్శకుడు ధనుష్‌. ముఖ్యంగా ఆస్పత్రిలో పోరాట ఘట్టాలు, సేతు మనిషిని ఇంటికి పిలిపించి చంపి, టీ తాగడం తదితర సన్నివేశాలు ప్రేక్షకులలతో ఈలలు కొట్టిస్తాయి. రక్తపాతం, తమిళ వాసనలతో కూడిన కొన్ని అతి సన్నివేశాలు ఉన్నప్పటికీ… ఒక మామూలు కథని ధనుష్‌ తన అండర్‌ ప్లే నటనతో, వైవిధ్యమైన కొన్ని మాస్‌ ఘట్టాలతో రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. హత్తుకునే భావోద్వేగాల్ని పండించే అవకాశం ఉన్న కథే అయినా, ధనుష్‌ ఆ దిశగా దృష్టి సారించలేదు.