‘హనుమాన్‌’ సీక్వెల్‌..జై హనుమాన్‌ !

తేజా సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘హనుమాన్‌’ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! సూపర్‌ హీరో కథకు ఇతిహాసాన్ని జోడిరచి ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ను తెరకెక్కించనున్నారు.

ఈ చిత్రాన్ని ఉద్దేశించి ప్రశాంత్‌ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సీక్వెల్‌లో తేజ హీరో కాదని తెలిపారు. ‘హనుమాన్‌’ సక్సెస్‌లో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు.

‘హనుమాన్‌’ కంటే వందరెట్లు భారీ స్థాయిలో ‘జై హనుమాన్‌’ ఉండబోతోంది. ఈ సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదు. ’జై హనుమాన్‌’లోనూ అతడు హనుమంతుడు పాత్రలో కనిపిస్తాడు. కానీ, ఆ సినిమా హీరో ఆంజనేయ స్వామి. ఆ పాత్రను స్టార్‌ హీరో చేస్తారు. 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం.

దీనికంటే ముందు నా నుంచి మరో రెండు చిత్రాలు రానున్నాయి. అందులో ఒకటి ‘అధీర’. మరొకటి ‘మహాకాళి‘ అని ప్రశాంత్‌ వర్మ వెల్లడించారు. రూ.45 కోట్ల బ్జడెట్‌తో ‘హనుమాన్’ చేశామని చిత్ర బృందం తెలిపింది. విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం దేశం మొత్తం వినిపిస్తున్న మాటలు రెండు మాత్రమే అందులో ఒకటి జై శ్రీరామ్‌ కాగా మరోటి హనుమాన్‌. మొదటిది అయోధ్యలో రామ మందిర ప్రారంభం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశం మొత్తం జై శ్రీరామ్‌ నామ స్మరణలతో మారుమ్రోగుతుండగా మరోవైపు హనుమాన్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆప్రతిహాతంగా దూసుకెళుతూ కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తుండడంతో పాటు తెలుగు వారి గురించి మరోసారి చర్చించేలా చేస్తోంది.

ఇప్పటికి రిలీజైన అన్ని చోట్ల నుంచి సూపర్‌ పాజిటివ్‌ తెచ్చుకుంది. గతంలో ఎప్పుడు చూడని రికార్డులను తిరగ రాస్తున్నది. రోజురోజుకు కలెక్షన్లను పెంచుకుంటూ పోతుంది. ఈ హవా మరో వారం పదిరోజులు ఉండేలా కనిపిస్తోంది. ఓవర్సీస్‌లో 4కోట్ల 10 లక్షల బ్రేక్‌ ఈవెన్‌తో విడుదలైన హనుమాన్‌ సినిమా ఈరోజు వరకు రూ33 కోట్లకు పైగా కలెక్షన్లు సంపాదించి ‘గుంటూరు కారం’ వసూళ్లను దాటేసింది.