టాలీవుడ్లో మాచో స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్కి హిట్టుల కరువు తప్పడం లేదు. అభిమానులు ఆయన బలమైన కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నా, ప్రతి సినిమా నిరాశనే మిగులుస్తోంది. శ్రీను వైట్లతో చేసిన విశ్వం ఘోరంగా విఫలమవ్వగా, అంతకు ముందు భీమా యావరేజ్ టాక్ను మాత్రమే సంపాదించుకుంది. రామబాణం, పక్కా కమర్షియల్, ఆరడుగుల బులెట్, చాణక్య లాంటి సినిమాలు కూడా ఫ్లాప్ల జాబితాలో చేరాయి.
ఇలాంటి పరిస్థితుల్లో గోపీచంద్ మరోసారి కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నాడు. ఈసారి ఇద్దరు ఫ్లాప్ డైరెక్టర్లతో చేతులు కలిపినట్లు సమాచారం. మొదటి దర్శకుడు సంపత్ నంది. వీరి కలయికలో వచ్చిన సీటిమార్ పెద్దగా ఆకట్టుకోలేదు, కానీ గౌతమ్ నందా మాత్రం ఓ మాదిరి వసూళ్లు రాబట్టింది. మాస్ అంశాలను అందిపుచ్చుకునే టాలెంట్ సంపత్ నందికి ఉందని నమ్మి గోపీచంద్ మూడోసారి అవకాశం ఇచ్చినట్టు టాక్. ప్రస్తుతం శర్వానంద్తో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంపత్, ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత గోపీచంద్ సినిమాకు జంప్ కానున్నాడని అంటున్నారు.
ఇక రెండో దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఘాజీతో సంచలన విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆ తర్వాత చేసిన అంతరిక్షం, IB 71 ఆశించిన స్థాయిలో నిలవలేదు. ఇప్పుడు గోపీచంద్ కోసం పవర్ఫుల్ బ్యాక్డ్రాప్లో పీరియాడిక్ కాన్సెప్ట్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్లలో ముందుగా సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో సినిమా మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే, గోపీచంద్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ను లైన్లో పెట్టాడని సమాచారం. జిల్, రాధే శ్యామ్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడట. అయితే, లైనప్ రెడీ అయినా షూటింగ్ ప్రారంభం ఆలస్యమవుతోంది. ఇక అభిమానులు మాత్రం గోపీచంద్ను మళ్లీ జయం, నిజం తరహా విలన్గా చూడాలని ఆశిస్తున్నారు. కానీ, ఆ రూట్లోకి వెళ్లే ఉద్దేశం గోపీచంద్కు ఇప్పట్లో కనపడడం లేదు.