రాధాకృష్ణ దర్శకత్వంలో గోపీచంద్‌!

టాలీవుడ్‌ నటుడు గోపీచంద్‌ మరో సాహసం చేయబోతున్నాడు. ప్రభాస్‌కు ‘రాధేశ్యామ్‌’ వంటి భారీ డిజాస్టార్‌ సినిమాను ఇచ్చిన రాధాకృష్ణతో తన తర్వాతి సినిమా చేయనున్నాడు. రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యింది గోపీచంద్‌ సినిమాతో అన్న విషయం తెలిసిందే.

రాధాకృష్ణ దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా వచ్చిన చిత్రం ‘జిల్‌’. యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ చిత్రం 2015లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన విజయంతో ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్‌’ సినిమా చేశాడు రాధాకృష్ణ. కానీ ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అట్టర్‌ ప్లాప్‌గా నిలిచింది.

అయితే చాలారోజుల తర్వాత రాధాకృష్ణ ఓ సినిమా చేయబోతుండగా.. ఈ మూవీలో గోపీచంద్‌ హీరోగా నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ స్టోరీ లైన్‌ను గోపీచంద్‌కు వినిపించగా అతడు ఓకే చేసినట్లు టాక్‌. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను కూడా యూవీ క్రియేషన్స్‌ నిర్మించనుంది.