‘యాత్ర 2’ నుంచి ఫస్ట్‌ లుక్‌ విడుదల!

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాజకీయ జీవితంపై తెరకెక్కుతున్న సినిమా ‘యాత్ర 2’. ఈ సినిమాకు మహీవీ రాఘవ్‌ దర్శకుడు. 2019లో విడుదలైన యాత్రకు ఇది సీక్వెల్‌. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది.

వైఎస్సార్‌ పాత్రలో మలయాళ ‘సూపర్‌ స్టార్‌’ మమ్ముట్టి జీవించారు. ఇక యాత్ర 2లో కోలీవుడ్‌ స్టార్‌ జీవా.. వైఎస్‌ జగన్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా యాత్ర 2 నుంచి మేకర్స్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. యాత్ర 2 ఫస్ట్‌ లుక్‌ను ఈరోజు ఉదయం మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.

ఈ ఫస్ట్‌ లుక్‌లో ఒకవైపు జీవా ఉండగా.. మరోవైపు మమ్ముట్టి ఉన్నాడు. మమ్ముట్టి, జీవా ఇన్‌టెన్స్‌ లుక్స్‌తో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌లో ‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి కొడుకుని’ అంటూ పోస్టర్‌లో రాసుకోచ్చారు. ఫస్ట్‌ లుక్‌తో పాటు మేకర్స్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ కూడా ప్రకటించారు.

యాత్ర 2 సినిమా 2024 ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ సినిమాను తెరకెక్కించారు. అత్యంత ప్రజాదరణను పొందిన ఈ చిత్రంకు కొనసాగింపుగా వైఎస్‌ఆర్‌ తనయుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ‘యాత్ర 2’ని తెరకెక్కిస్తున్నారు.

‘యాత్ర’ చిత్రాన్ని 2019 ఫిబ్రవరి 8న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుండడం విశేషం. యాత్ర ఫస్ట్‌ పార్టులో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించగా.. సెకండ్‌ పార్టులో మమ్ముట్టి సహా జీవా లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌ సినిమాను త్రి ఆటమ్‌ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతోన్న యాత్ర 2 చిత్రానికి మది కెమెరామెన్‌ కాగా.. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. యాత్రలో జగపతి బాబు, రావు రమేష్‌, అనసూయలు కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.