‘దేవర’పై పెరుగుతున్న అంచనాలు… జాన్వీకి తెలుగులో తొలి సినిమా!

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం’దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘జనతా గ్యారేజ్‌’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరికొత్త గెటప్‌ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంత రఫ్‌ లుక్‌ లో కనిపించబోతున్నారట. మాస్‌ లుక్‌ తో అందరినీ ఆశ్చర్యపరిచే అవకాశం ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

అంతేకాదు, తారక్‌ రోల్‌ కు సంబంధించి ఓ కీలక ట్విస్ట్‌ ఉండబోతు న్నట్లు తెలుస్తోంది. ఆ ట్విస్ట్‌ సినిమా మొత్తానికి హైలెట్‌ గా నిలవబోతున్నట్లు సమాచారం. అటు త్వరలోనే ఈ మూవీకి సంబంధించి స్పెషల్‌ వీడియో గ్లింప్స్‌ రిలీజ్‌ కాబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇటు ‘దేవర’ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్‌ 5న విడుదల అవుతుందని అందరూ భావిచారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ఇంకా కంప్లీట్‌ కాలేదు. రీసెంట్‌ గా ఈ సినిమాలో విలన్‌ రోల్‌ పోషిస్తున్న సైఫ్‌ అలీ ఖాన్‌ గాయపడ్డారు. ఆయన పార్ట్‌ షూటింగ్‌ పెండింగ్ లోనే ఉంది. అటు ఈ సినిమాకు పాటలు, నేపథ్య సంగీతాన్ని అందించేందుకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవి చందర్‌ చాలా టైమ్‌ తీసుకుంటున్నారట. అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ లోనే జరిగే అవకాశం ఉంది. మొత్తంగా పలు కారణాలతో ఈ సినిమా సమ్మర్‌ బరి నుంచి తప్పుకోబోతోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది.

ఈ సినిమా గురించి జాన్వీ రీసెంట్‌ గా కీలక విషయాలు వెల్లడించింది. ‘నేను ఇప్పటి వరకు నటించిన సినిమాలు ఒక ఎత్తు, ‘దేవర’ సినిమా మరోఎత్తు. ఇప్పటి వరకు నేను నటించిన సినిమాలు ఓ వర్క్‌ షాప్‌ లా పనికి వచ్చాయి. ఈ సినిమాతో నాలోని నటిని పూర్తి స్థాయిలో చూడబోతున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాం. ఈ సినిమా అనుభవాలను బేస్‌ చేసుకుని నా సినీ కెరీర్‌ ను నిర్మించుకునే ప్రయత్నం చేస్తాను‘ అని చెప్పింది. భారతదేశంలోని తీర ప్రాంతాల కథ నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తుండగా, ఆర్‌ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మొదటి పార్ట్‌ను ఏప్రిల్‌ 5న విడుదల చేయాలనుకున్నారు. అయితే విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు, విలన పాత్రధారి సైఫ్‌ అలీఖాన్‌ గాయపడటం తదితర కారణాలతో సినిమాని వాయిదా వేయాలనే నిర్ణయానికి చిత్రబృందం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ సమర్పకులు.