దృశ్యం ఫ్రాంఛైజీ అంటేనే టాలీవుడ్లో వెంకటేష్ గుర్తొస్తాడు. “రాంబాబు” పాత్రకు జీవం పోసిన ఆయన పెర్ఫార్మెన్స్ రెండు భాగాలకూ ప్రధాన బలంగా నిలిచింది. ఇప్పుడు మలయాళంలో మోహన్ లాల్తో ‘దృశ్యం 3’ మొదలయ్యింది. కానీ ఈసారి తెలుగు, హిందీ, ఇతర భాషల్లో రీమేక్ చేయకుండా పాన్ ఇండియా డబ్ వెర్షన్ రిలీజ్ చేయాలనే ఆలోచన మేకర్స్ లో ఉందట.
ఈ నిర్ణయం తెలుగులో వెంకటేష్ అభిమానుల్లో కలకలం రేపుతోంది. మలయాళ వెర్షన్ను డబ్ చేసి రిలీజ్ చేస్తే తెలుగు ఆడియన్స్ కి పూర్తి కనెక్ట్ అవుతుందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ డైరెక్ట్ మలయాళ వెర్షన్నే రిలీజ్ చేస్తే, బిజినెస్ పరంగా లాభాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి.
ఇండస్ట్రీ వర్గాల అంచనాల ప్రకారం, తెలుగులో వెంకటేష్తో దృశ్యం 3 చేస్తే థియేట్రికల్ రేంజ్ 40-50 కోట్ల వరకూ ఉండొచ్చు. కానీ డబ్ వెర్షన్తో పది కోట్ల మార్కే గరిష్టంగా ఉంటుందని ట్రేడ్ టాక్. పైగా వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ కలిగి ఉండటం, ఈ కథకు ఆయన ఎమోషనల్ టచ్ కలిపిన విధానం సినిమా విజయానికి కీలకం కావచ్చు.
ఇప్పుడు మేకర్స్ ముందు ఓ కీలక దిశలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపు బడ్జెట్ తక్కువ పెట్టి అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని ఆలోచన, మరోవైపు స్థానిక నటులతో అర్థికంగా ఎక్కువగా వసూలు చేసే అవకాశాలు. అయితే తెలుగు ప్రేక్షకుల అభిప్రాయం స్పష్టంగా ఉంది.. వెంకటేష్ లేకుండా దృశ్యం 3ని ఉహించుకోలేము అంటున్నారు. మరి మేకర్స్ ఎలాంటి రిస్క్ తీసుకుంటారో.