Dhanush and Aishwarya: తమిళ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్కు విడాకులు మంజూరయ్యాయి. ఈ జంటకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ధనుష్-ఐశ్వర్య జంట తాము విడిపోతున్నట్లు 2022 జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు.
ఈ మేరకు ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ క్రమంలో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా గతవారం కోర్టుకు హాజరయ్యారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని.. విడిపోవాలనే నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తుది విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. తాజాగా ఇద్దరికీ విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్దకుమార్తె అయిన ఐశ్వర్య.. 2004 నవంబర్ 18న ధనుష్ను వివాహం చేసుకుంది. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గత రెండేళ్లుగా వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. డివోర్స్ ప్రకటన తర్వాత ఈ జంట వారి కుమారుల పాఠశాల కార్యక్రమాలలో కనిపించారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలూ ఐశ్వర్య వద్దే ఉంటున్నారు. అప్పుడప్పుడు తండ్రి ధనుష్ వద్దకు వెళ్లి వస్తున్నట్లు తమిళ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.