వంశీపైడిపల్లి దర్శకత్వలో షాహిద్‌ కపూర్‌!?

బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ తెలుగు దర్శకులతో సినిమాలు ప్లాన్‌ చేస్తున్నాడు. ఇప్పటికే షాహిద్‌ కపూర్‌ సందీప్‌ రెడ్డి వంగాతో ‘కబీర్‌ సింగ్‌’, గౌతమ్‌ తిన్ననూరితో ‘జెర్సీ’ చేశాడు. ఈ రెండు సినిమాలు తెలుగు రీమేక్‌ లే కావడం విశేషం. వాటిలో ‘కబీర్‌ సింగ్‌’ బ్లాక్‌ బస్టర్‌ గా నిలవగా.. ‘జెర్సీ’ మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్‌ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

అయితే ఈ సినిమాల అనంతరం షాహిద్‌ మరో టాలీవుడ్‌ దర్శకుడిని లైన్‌లో పెట్టినట్లు తెలుస్తుంది.’బృందావనం, ‘ఎవడు’, ‘మహర్షి, ‘వారసుడు’ సినిమాలతో బ్లాక్‌ బస్టర్‌లు అందుకున్న వంశీ పైడిపల్లి తో షాహిద్‌ తన నెక్ట్స్‌ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి షాహిద్‌తో సంప్రదింపులు జరుపగా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. పాన్‌ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ చిత్రానికి దిల్‌ రాజ్‌ నిర్మాతగా వ్యవహారించనున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.