ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్‌ మూవీ చేయాలనుంది: హీరో ధనుష్‌

తమిళ నటుడు ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘రాయన్‌’. సందీప్‌ కిషన్‌, మలయాళం నటుడు కాళిదాస్‌ జయరాం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్‌లు విడుదల చేయగా.. ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. విడుదల తేదీ దగ్గరపడటంతో హైదరాబాద్‌లో భారీ ఎత్తున్న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకలో ధనుష్ పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. టాలీవుడ్‌లో తన ఫేవరెట్‌ హీరో పవన్‌ కళ్యాణ్‌ అని వెల్లడించారు.

‘ఐ లవ్‌ సినిమా, ఐ లవ్‌ పవన్‌ కళ్యాణ్‌ సర్‌’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఆడిటోరియం అంతా దద్దరిల్లిపోయింది. జూనియర్‌ ఎన్టీఆర్‌తో మల్టీస్టార్టర్‌ మూవీ చేయాలని ఉందని ధనుష్ అన్నారు.

చిత్ర కథ విషయానికి వస్తే.. అతనో సాధారణ వ్యక్తి. మద్రాస్‌లోని ఓ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తుంటాడు. కానీ అతని గతం మాత్రం పగతో రగిలిపోతుంటుంది. ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం ఎదురుచూస్తుంటాడు. ఇంతకి ఆ వ్యక్తి ప్రతీకారం ఎవరి విూద? పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌ అయిన అతను హోటల్‌లో చెఫ్‌గా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ‘రాయన్‌’ సినిమా చూడాల్సిందే అని చెబుతోంది చిత్ర బృందం.

ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, విష్ణువిశాల్‌, దుషారా విజయన్‌, సెల్వ రాఘవన్‌, ఎస్‌జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ధనుష్‌ ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేరా’ అనే సినిమా చేస్తున్నాడు.