‘దేవర’ రెండు కాదా.? మూడు ముక్కలు చేస్తారా.?

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమా తొలుత ఒకే భాగంగా ప్రారంభమైంది. కానీ, సినిమా ప్రారంభమయ్యాక.. కొంత పార్ట్ షూట్ జరిగాక, రెండు పార్టుల ఆలోచన చేశారు.

సినిమాకి వున్న స్పాన్, రీచ్ సహా అనేక కారణాల వల్ల రెండు పార్టులుగా ‘దేవర’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని దర్శకుడు కొరటాల శివ ప్రకటించాడు. ఏప్రిల్ మొదటి వారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుంది.

కానీ, సినిమాలో కీలక పాత్ర పోషిస్తోన్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇటీవల ఓ ప్రమాదంలో గాయపడ్డంతో, షూటింగ్‌కి కొంత బ్రేక్ వచ్చింది. దాంతోపాటుగా, వీఎఫ్ఎక్స్ వ్యవహారాలు, ఇతరత్రా సమస్యల కారణంగా ఏప్రిల్‌లో ‘దేవర’ తొలి పార్ట్ విడుదల కావడం దాదాపు అసాధ్యమే.

‘దేవర’ వాయిదా ప్రచారం నేపథ్యంలో, వేరే సినిమాలు ఆ డేట్ మీద లుక్కేశాయి. ఇదిలా వుంటే, ‘దేవర’ సినిమాకి రెండు పార్టులు కాదు, మొత్తం మూడు పార్టులంటూ ఓ ప్రచారం గుప్పుమంటోంది. దీనిక్కూడా పైన చెప్పుకున్న కారణాలనే చెబుతున్నారు.

ఇదంతా నిజమేనా.? కొరటాల శివ ఈ ప్రచారంపై ఏమంటాడు.? సినిమా విడుదల వాయిదాపై అధికార ప్రకటన ఎప్పుడొస్తుంది.? ఏమో, వేచి చూడాల్సిందే.