దీవాళి నైట్ ఫొటో షేర్ చేసిన చిరంజీవి.. రెండు క‌ళ్లు చాలట్లేదంటున్న అభిమానులు

చీక‌ట్ల‌ని తొల‌గించి వెలుగులు తీసుకొచ్చే దీపావ‌ళి పండుగ అంత‌టా ఘ‌నంగా జ‌రిగింది. సెల‌బ్రిటీలు కూడా ఎంతో ఉత్సాహంతో దీపావ‌ళి వేడుక జ‌రుపుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రు త‌మ దీపావ‌ళి వేడుక‌కి సంబంధించి ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో అవి వైర‌ల్‌గా మారాయి. కాస్త లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో దీవాళి నైట్ ఎలా గ‌డిచింద‌నేది పోస్ట్ ద్వారా చూపించారు.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో మెగాస్టార్ చిరంజీవి సెల్ఫీ దిగుతుండ‌గా, ఆకాశంలో తారాజువ్వలు ప్ర‌కాశిస్తుండ‌గా ఆ అద్భుతం ఫోటోకి చిక్క‌గా అభిమానుల ఆనందం అవ‌ధులు దాటింది. చిరంజీవికి క‌రోనా నెగెటివ్ అని రావ‌డంతో రామ్ చ‌ర‌ణ్ త‌న తండ్రితో క‌లిసి దీవాళి సెల‌బ్రేట్ చేసుకున్నాడు. ఇద్ద‌రు క‌లిసి దిగిన ఫొటో అభిమానులకు చూడ‌ముచ్చ‌ట‌గా అనిపిస్తుంది. చాలా రోజుల త‌ర్వాత తండ్రికొడుకుల‌ని ఇలా చూసాం అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఉంటే ఆ ఫొటోకి మ‌రింత అందం చేకూరేది అని కొంద‌రు ప‌వ‌న్ ఫ్యాన్స్ కామెంట్ పెడుతున్నారు.

నాసిర‌కం కిట్ వ‌ల‌న చిరంజీవికి క‌రోనా పాజిటివ్ రిపోర్ట్ వ‌చ్చింద‌ని, చిరు శ‌రీరంలో క‌రోనా లేద‌ని వైద్యులు క‌న్‌ఫాం చేయ‌డంతో దీపావ‌ళి రోజు మెగాస్టార్ త‌న గురువు ఆశీర్వాదం కోసం ఆయ‌న ఇంటికి స‌తీస‌మేతంగా వెళ్లారు. కొద్ది సేపు ఆరోగ్య విష‌యాలు, సినిమా సంగ‌తులు చ‌ర్చించుకున్నారు. అయితే చిరంజీవి బ‌య‌ట తిరుగుతున్న విష‌యం తెలుసుకున్న తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పాజిటివ్ గా తేలి.. ఆపై నెగెటివ్ వచ్చినా ఐసీఎంఆర్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం క్వారంటైన్ లో ఉండాల్సిందేనని అన్నారు.