ఆ కార్లే కావాలంటున్న టాలీవుడ్ హీరోలు

ఈ మధ్య మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు పర్యావరణాన్ని కాపాడే ఈ కార్లను అందరూ వాడాలనుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ కార్లకంటే ఇవి కాస్త తక్కువ ధర ఉండడంతో సామాన్య ప్రజలు సైతం ఎక్కువ మక్కువ చూపుతున్నారు.

అయితే ఇదే హవాను స్టార్ హీరోలు కూడా కొనసాగిస్తున్నారు. మన తెలుగు స్టార్ హీరోలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న మెగాస్టార్ చిరంజీవి పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ కారు కొన్ని విషయం అందరికీ తెలిసిందే. అయితే దాని ఖరీదు కోటి రూపాయలు. అలాగే మాస్ మహారాజ రవితేజ కూడా తాజాగా ఈవీ కార్ కొన్నారు. 35 లక్షల ఖరీదు చేసే ఎలక్ట్రిక్ వాహనాన్ని తన సొంతం చేసుకున్నారు.

తాజాగా అల్లరి నరేష్ కూడా కియా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారును తీసుకున్నారు. ఈ కారుకి మంచి ఫ్యాన్సీ నంబర్ కావాలని 94 వేలు రూపాయలు వెచ్చించి మరీ టీఎస్ 09 జీబీ 2799 అనే నంబర్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్ ఆన్ లైన్ బిడ్డింగ్ ద్వారా రూ.94,899 చెల్లించారు. మెగాస్టార్ చిరంజీవి తన నంబర్ కోసం 5 లక్షల రూపాయలు చెల్లించగా, రవితేజ 17 వేలు చెల్లించారు.

తమకు పెట్రోల్, డీజిల్ తో నడిచే ఎన్ని బ్రాండెడ్ కార్లు ఉన్నా సరే ఓ ఎలక్ట్రిక్ వాహనం కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ఈవీ కార్లను కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో తిరగడానికి ఈ కార్లు చాలా బాగుంటాయని వారు ఫీలవుతున్నట్లు సమాచారం. ఎక్కువ దూరం లేదా పెద్ద పెద్ద పార్టీలకు వెళ్లేటప్పుడు మాత్రం రెగ్యులర్ లగ్జరీ కార్లను వాడుతుంటారు.

ఏది ఏమైనా స్టార్ హీరోలు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తూ సామాన్య ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పెట్రోల్ ఖర్చులను తగ్గించడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. మరికొంత మంది స్టార్ హీరోలు సైతం ఈవీ కార్లను కొనుగోలు చేస్తారని తెలుస్తోంది. మరి చూడాలి ఇంకెవరు ఈవీ వాహనాలను తమ సొంతం చేసుకుంటారో.