శరవేగంగా మెగాస్టార్ ‘విశ్వంభర’ షూటింగ్‌ మ్యూజిక్‌ సిట్టింగిలో కూర్చున్న చిరు

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఒకప్పుడు మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ ను చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కలిసి కూర్చుని నిర్వహించే వారు. కానీ ఇప్పుడు మాత్రం విదేశాల్లో, ఎక్కడో హాలీడే స్పాట్స్‌ లో దర్శకుడు మరియు సంగీత దర్శకులు మాత్రమే పాల్గొంటున్నారు. ఆ పద్దతికి స్వస్థి చెప్పి మెగాస్టార్‌ ఇలా ప్లాన్ చేశారు. దర్శకుడు, సంగీత దర్శకుడితో పాటు హీరో చిరంజీవి మరియు ఇతర సాంకేతిక వర్గం కూడా ఈ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి పాత సినిమాలకు చెందిన కొన్ని పాటలను కీరవాణి తన టీం తో పాడటంతో పాటు సంగీత కచేరి నిర్వహించారు. సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కచేరికి సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఆ రోజులను గుర్తు చేస్తూ చిరంజీవి ఈ వీడియోను షేర్‌ చేయడంతో పాటు కీరవాణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. అందరు హీరోలు దర్శకులు ఇలాగే ప్లాన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.మరోవైపు సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ సినిమా పనులు శరవేగంగా జరుగు తున్నాయి.

సినిమా డబ్బింగ్‌ వర్క్‌ మొదలైనట్లు నిర్మాణసంస్థ ఓ అప్‌డేట్‌ షేర్‌ చేసింది. దీనికి సంబంధించిన పనులు ఈరోజు ప్రారంభమయ్యాయని పేర్కొంది. షూటింగ్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని తెలిపింది. ప్రేక్షకులంతా జనవరి 10న అద్భుతమైన అనుభూతిని పొందడానికి సిద్ధంగా ఉండాలని కోరింది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాదాపు రూ.200 కోట్ల భారీ బ్జడెట్‌తో ‘విశ్వంభర’ తీర్చిదిద్దుతున్నట్లు టాక్‌. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా ఇది నిలిచిపోనుంది.

అంతేకాదు, సోషియో ఫాంటసీ మూవీ కావడంతో వీఎఫ్‌ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్‌ ఉండనున్నట్లు ఎప్పటినుంచో టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో స్టార్‌ హీరోయిన్‌ త్రిష , ఆషికా అధికారికంగా జాయిన్‌ అయ్యారు. సురభి, ఇషా చావ్లా, విూనాక్షి చౌదరి పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రంలో చిరంజీవి హనుమంతుడి భక్తుడిగా కనిపించనున్నాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌లు కూడా అదిరిపోయేలా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ నటుడు కునాల్‌ కపూర్‌ నటించబోతున్నాడు.