సాంకేతిక ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే మరో ఆవిష్కరణను చైనా తెరపైకి తీసుకొచ్చింది. ‘ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్ల పాటు పని చేసే బ్యాటరీ’ అంటూ బీటావోల్ట్ అనే చైనా సంస్థ వెల్లడించిన కొత్త ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ‘బీవీ100’ అనే పేరుతో ఈ న్యూక్లియర్ మైక్రో బ్యాటరీని అభివృద్ధి చేయడం విశేషం.
ఈ బ్యాటరీ తయారీలో నికెల్-63 అనే రేడియోధార్మిక పదార్థాన్ని ఉపయోగించి, దాని క్షయం ద్వారా విడుదలయ్యే శక్తిని డైమండ్ ఆధారిత సెమీకండక్టర్ల ద్వారా విద్యుత్గా మార్చతామని బీటావోల్ట్ చెబుతోంది. కేవలం నాణెం సైజులో ఉండే ఈ బ్యాటరీను ఇప్పటికే 100 మైక్రోవాట్ల శక్తిని ఉత్పత్తి చేసే స్థాయికి తీసుకెళ్లినట్లు కంపెనీ పేర్కొంది. త్వరలోనే 1 వాట్ సామర్థ్యం కలిగిన మోడల్ను మార్కెట్కు తీసుకురావడమే లక్ష్యమట.
లిథియం-అయాన్ బ్యాటరీలతో పోలిస్తే ఈ న్యూక్లియర్ బ్యాటరీ పది రెట్లు ఎక్కువ శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉండనుందట. శీతల స్థితిలోనూ, అత్యధిక వేడి వాతావరణంలోనూ ఇది సమర్థంగా పనిచేయగలదని బీటావోల్ట్ చెబుతోంది. మరో విశేషం ఏంటంటే… దీన్ని న మళ్ళీ ఛార్జ్ చేయాల్సిన అవసరమే ఉండదట!
ఈ బ్యాటరీ ప్రధానంగా వైద్య పరికరాలు, డ్రోన్లు, స్పేస్ టెక్నాలజీ, AI సెన్సార్లు వంటి రంగాల్లో ఉపయోగించే అవకాశం ఉంది. ఇక ఇది విప్లవాత్మక మార్పులకు దారి తీయనుందన్నది కంపెనీ అంచనా. అయితే ఇప్పట్లో సాధారణ వినియోగానికి ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. అయినా, దీన్ని పరిశోధనకు వాడుతూ ఉన్న పరిశ్రమలకు ఇది గేమ్ ఛేంజర్ అయ్యే అవకాశం ఉంది.