ఫోన్‌ ఇస్తా.. మరీ నాకేంటీ..?

ఈ మధ్యకాలంలో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోన్న పోస్ట్ ఒకటుందంది. అదే… బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి. అందుకు కారణం వాల్తేరు వీరయ్య, ఏజెంట్‌ చిత్రాలలో హాట్‌హాట్‌ ఐటెమ్‌ సాంగ్స్‌లో కనిపించడం ఓ కారణమైతే… ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బ్యూటీ అందాలను ఆరబోస్తూ పోస్ట్‌ చేసే ఫొటోలు మరో కారణం.

ఈ మధ్యన జరిగిన భారత పాక్‌ వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో తన ఖరీదైన ఫోన్‌ పోగొట్టుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. వెంటనే సమీప పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేశారు. కానీ ఫోన్‌ మాత్రం తిరిగి రాలేదు.

దాంతో ఫోన్‌ తిరిగి ఇచ్చినవారికి రివార్డ్‌ ఇస్తానని ఇన్ స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది. ఫోన్‌ పోయిన లొకేషన్‌ను కూడా షేర్‌ చేసింది. సోషల్‌ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్‌కు ఫలితం కనిపించింది. ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఆమెకు మెసేజ్‌ వచ్చింది. ‘మీ ఫోన్‌ నా దగ్గరే ఉంది. అది మీకు దక్కాలంటే క్యాన్సర్‌తో బాధపడుతున్న నా సోదరుడిని కాపాడుకోవడం కోసం సాయం చేయండి’ అని సదరు వ్యక్తి కండీషన్‌ పెట్టాడు.

అందుకు ఊర్వశి రౌతేలా సరే అన్నట్లు థంబ్స్‌ పోస్ట్‌ చేసింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది కూడా. అయితే ఒప్పందం ప్రకారం అతను ఫోన్‌ తెచ్చాడా.. లేదా? అన్నది తెలియాల్సి ఉంది.