మగబిడ్డకు జన్మనిచ్చిన యామీగౌతమి.. వేదవిద్‌ పేరు పెట్టామంటూ ప్రకటన!

నటి యామీ గౌతమ్‌ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త ఆదిత్యాధార్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ఆ బాబుకు ‘వేదవిద్‌’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఆయన పోస్ట్‌కు నెటిజన్లు శుభాకాంక్షలతో కామెంట్లు చేస్తున్నారు. ‘యామీ గౌతమ్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అక్షయ తృతీయ లాంటి పర్వదినాన మాకు మగ బిడ్డ పుట్టాడు. మరొక అందమైన ప్రయాణాన్ని ప్రారంభించాం. అందరి ఆశీస్సులతో మా కుమారుడికి గొప్ప భవిష్యత్తు ఉండాలని కలలు కంటున్నాం. అతడు ఎన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాం. మా కుటుంబానికి అలాగే దేశానికి గర్వకారణమయ్యేలా ఎదగాలని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

అలాగే ఆస్పత్రిలో సహకరించిన సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. యామీ-ఆదిత్య ధార్‌ 2021లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.’నువ్విలా’తో తెలుగు తెరకు పరిచయమైన యామీగౌతమ్‌ పలు బాలీవుడ్‌ సినిమాలతో పాపులర్‌ అయ్యారు. అదే సమయంలో ‘గౌరవం’,’యుద్థం’, ‘కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌’ చిత్రాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ఆమె నటించిన ‘ఆర్టికల్‌ 370’ ఈవెంట్‌లో తల్లికానున్నట్లు ప్రకటించారు.