Vaibhav Suryavanshi: చరిత్ర సృష్టించిన 14ఏళ్ల వైభవ్‌కు నగదు బహుమతి

బీహార్‌కు చెందిన 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన అసాధారణ ప్రతిభతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇటీవల గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతుల్లో సెంచరీ బాదిన అతడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో శతకం సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. ఈ ఘనతపై బీహార్ ప్రభుత్వం నుంచి ఆయనకు భారీ ప్రోత్సాహం లభించింది.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వైభవ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. యువ క్రికెటర్ అద్భుత ప్రదర్శనతో రాష్ట్రానికి గర్వకారణం అయ్యాడని ప్రశంసించారు. వైభవ్ ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.10 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. అతని తండ్రితో కలిసి గతంలోనే వైభవ్‌ను కలుసుకున్నానని, అతడిలో గొప్ప టాలెంట్ ఉందని అప్పుడే ఊహించానని నితీశ్ పేర్కొన్నారు.

జైపూర్ వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో, రాజస్థాన్ రాయల్స్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్, ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చిత్తు చేశాడు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఎవరూ అతడి దూకుడును తట్టుకోలేకపోయారు. కేవలం 38 బంతుల్లో 101 పరుగులు చేసి అన్ని వయస్సుల క్రికెట్ అభిమానులను అబ్బురపరిచాడు.

వైభవ్ సెన్సేషనల్ ఇన్నింగ్స్‌పై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే అంత బలమైన ఇన్నింగ్స్ ఆడడం గొప్ప విషయం అని ప్రశంసించారు. అతడి భవిష్యత్తు భారత క్రికెట్‌కు గర్వకారణం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ పేరు క్రీడా ప్రపంచంలో మారుమోగిపోతోంది. మరిన్ని రికార్డులను తిరగరాస్తాడన్న నమ్మకం క్రీడా విశ్లేషకుల్లో, అభిమానుల్లో నెలకొంది. చిన్న వయసులో అతడు సాధించిన ఈ గెలుపు, లక్ష్యాల వైపు అతడిని మరింత దూసుకుపోయేలా చేస్తుందని విశ్లేషిస్తున్నారు.

ఇంటి దొంగలు || Retired Army Officer Vara Prasad About India Pakistan WAR || Telugu Rajyam